పీవీ నరసింహారావు
జననం: 1924 జూన్ 28
స్వస్థలం: వంగర (భీమదేవరపల్లి మండలం, కరీంనగర్ జిల్లా)
తల్లిదండ్రులు: రుక్మాబాయమ్మ, సీతారామారావు (వంగర గ్రామం)
మరణం: 2004 డిసెంబర్ 23
ఈయన వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా లక్నేపల్లి గ్రామంలో జన్మించారు.
భారత ప్రధానమంత్రి పదవిని నిర్వహించి అపూర్వ గౌరవం పొందిన తెలంగాణ నాయకుడు పీవీ నరసింహారావు.
రుక్మాబాయమ్మ, సీతారామారావు సమీప బంధువైన పాములపర్తి రంగారావు నరసింహారావును దత్తత తీసుకున్నారు.
1938 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన వందేమాతర ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించి కళాశాల నుంచి సస్పెండ్ అయ్యారు. తర్వాత నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు.
నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాది పట్టా పొందిన తర్వాత హైదరాబాద్లోని అప్పటి ప్రముఖ న్యాయవాది బూర్గుల రామకృష్ణారావు దగ్గర జూనియర్గా కొంతకాలం పనిచేశారు.
పోలీస్చర్య తర్వాత 1948లో పాములపర్తి సదాశివరావుతో కలిసి కాకతీయ అనే వార పత్రికను ప్రారంభించారు.
1957లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యారు.
1962లో రెండవసారి మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయి నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో రాష్ట్రమంత్రిగా నియమితులై జైలు, సమాచార, పౌరసంబంధాల శాఖను నిర్వహించారు.
1967లో మూడవసారి మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయి కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో దేవాదాయధర్మాదాయ శాఖను నిర్వహించారు. 1971 సెప్టెంబర్ 28న తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.
1981 నుంచి కేంద్రమంత్రిగా వివిధ శాఖల్లో పనిచేశారు. 1991 జూన్ 21న భారత 10వ ప్రధానమంత్రిగా పదవి చేపట్టి దక్షిణభారతం నుంచి ఎన్నికయిన తొలి ప్రధానిగా గుర్తింపు పొందారు.
ఈయన మంత్రివర్గంలో 14 మంది కేబినెట్హోదా మంత్రులు, 33 మంది స్టేట్మంత్రులు, ఆరుగురు ఉపమంత్రులను తీసుకున్నారు.
రచనలు
హరినారాయణ ఆప్టే (సుప్రసిద్ధ మరాఠీ రచయిత) రచించిన ‘ఫణ్ లక్షాత్ కోణ్ ఫేతో’ అనే మరాఠీ గ్రంథాన్ని ‘అబల జీవితం’ పేరుతో తెలుగులోకి అనువదించారు.
నరసింహారావు బహుభాషా పండితుడు. గొప్ప కవి. ఈయన విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయిపడగలు’ ను ‘సహస్ర ఫణ్’ పేరుతో హిందీలోకి అనువదించారు.
ఈయన ఇంగ్లిష్లో ఇన్సైడర్ అనే గ్రంథం రాశారు. దీనిని కల్లూరి భాస్కర్ లోపలి మనిషి పేరుతో తెలుగులోకి అనువదించారు.
పీవీ నరసింహారావుకు 2004 అక్టోబర్ 3న హైదరాబాద్లో జరిగిన స్వామి రామానందతీర్థ శతజయంతి ఉత్సవ సభలో స్థితప్రజ్ఞ అనే బిరుదును ప్రదానం చేశారు.
సర్వదేవభట్ట నరసింహమూర్తి
జననం: 1926
స్వస్థలం: పిండిప్రోలు (ఖమ్మం)
భార్య: వరలక్ష్మి
తండ్రి న్యాయవాదిగా చూడాలనుకున్నా.. బాబాయి రామనాథం (కమ్యూనిస్టు) స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమ లోకంలో జీవించారు.
ఈయన కోఠిలో ఒక ఇరుకు గదిలో ఉండేవారు. ఇది కొంతకాలానికి తెలంగాణ యువ రచయితలకు కేంద్రమైంది. ఈ కేంద్రంలో నరసింహమూర్తి ‘ప్రజా సాహిత్య పరిషత్తు’ను స్థాపించారు.
ఉర్దూలో ఇతని కవిత్వ పటిమకు మెచ్చి ‘ప్రజాకవిరాజు’ అనే బిరుదును నైజాం సర్కార్ ఇచ్చింది. ఈ బిరుదే తరువాత ‘కవిరాజమూర్తి’ గా స్థిరపడింది. 1949లో ఉర్దూలో తెలంగాణ అనే పక్షపత్రిక నడిపారు.
రచనలు
కవితా సంపుటి అంగారే (నిప్పురవ్వలు)
నవలలు : మై గరీబ్ హూ (ఉర్దూ), లహూకి లకర్ (రక్తరేఖలు)
నాటిక : మార్పు
మై గరీబ్ హూ అనే ఉర్దూ నవలలో మూర్తి తన జీవితం, తన సమాజం, తనకు ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం గురించి చర్చించారు. ఈ నవల వల్ల తెలంగాణ సాహిత్య (ఉర్దూ) చరిత్రలో నరసింహమూర్తి అపరిచితుడిగా మిగిలిపోయారు.
భూపతి కృష్ణమూర్తి
జననం: 1926 ఫిబ్రవరి 21
స్వస్థలం: ముల్కనూర్ (భీమదేవరపల్లి, కరీంనగర్)
మరణం: 2015 ఫిబ్రవరి 15
ఈయన తెలంగాణ గాంధీగా ప్రసిద్ధిచెందారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. ఈయన కాంగ్రెస్లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు.
1944 అక్టోబర్ 2న గాంధీజీ జన్మదినం రోజున వార్ధాలో గాంధీని కలిశారు.
దాశరథి కృష్ణమాచార్య
జననం: 1927
స్వస్థలం: చిన్నగూడూరు (మహబూబాబాద్ తాలూకా వరంగల్ జిల్లా)
తల్లిదండ్రులు: వెంకటమ్మ, వెంకటాచార్యులు
నిజాం నవాబుకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లిన దాశరథి కృష్ణమాచార్యులు తన కవిత్వం ద్వారా పోరాటానికి స్ఫూర్తినిచ్చారు. ‘మా నిజాం రాజు జన్మజన్మల బూజు’ అని నిజాంకు వ్యతిరేకంగా నినదించారు.
దాశరథి ‘తిమిరంతో సమరం’ రచనకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు, ‘కవితా పుష్పకం’ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిని రగిలించింది. ఈయనకు విశ్వకళా పరిషత్ (ఆంధ్రా యూనివర్సిటీ) 1975లో కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చింది.
ఈయన సంస్కృత, తమిళ భాషల్లో గొప్ప పండితుడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా పనిచేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవుల్లో రెండవ, చివరివారు.
పీడిత ప్రజలకు గొంతుగా మారి రైతులదే తెలంగాణం రైతులదే అని గర్జించారు. ఆంధ్రసారస్వత పరిషత్ నిర్మాతల్లో ఈయన ఒకరు. 1988లో మూసీ నది గురించి నేత్రపర్వంలో ‘ఓసీ మూసీ’ అనే కవిత రాశారు.
బిరుదులు: 1. అభ్యుదయ కవితా చక్రవర్తి
2. కవిసింహ
రచనలు
1. అగ్నిధార 2. మహాంధ్రోదయం
3. రుద్రవీణ 4. పునర్నవం
5. గాలిబ్ గీతాలు 6. అమృతాభిషేకం
7. నవమంజరి 8. నవమి
9. తిమిరంతో సమరం 10. కవితా పుష్పకం
11. దాశరథి శతకం 12. ఆలోచనాలోచనలు
తెలంగాణ ప్రజల స్వాతంత్రోద్యమానికి ప్రతిబింబం దాశరథి కవిత్వం అని దేవులపల్లి రామానుజరావు అన్నారు. దాశరథి తాను రాసిన రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణకు అంకితమిచ్చారు.
టంగుటూరి అంజయ్య
జననం: 1929
స్వస్థలం: భానూరు (మెదక్)
మరణం: 1986 అక్టోబర్ 20
అంజయ్య నిరుపేద కుటుంబానికి చెందినవాడు కావడం వల్ల హైదరాబాద్లోని ఆల్విన్ కంపెనీలో కార్మికుడిగా చేరి కార్మిక నాయకుడిగా పనిచేశారు. 1952లో హైదరాబాద్ రాష్ట్ర జాతీయ కార్మిక సంఘాల సమైక్యకు అధ్యక్షుడయ్యారు.
1972లో పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక మంత్రిగా పనిచేశారు. 1980లో ఇందిరాగాంధీ మంత్రిమండలిలో కార్మికమంత్రిగా పనిచేశాడు. 1980లో మర్రిచెన్నారెడ్డి రాజీనామా తరువాత అంజయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇతని మంత్రివర్గాన్ని ‘జంబో కేబినెట్’ గా పిలిచారు. అంజయ్య కాలంలోనే రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు (మలేషియాలో) నిర్వహించారు. 1984లో మరోసారి కేంద్ర కార్మిక శాఖ మంత్రి పదవి చేపట్టారు. హైదరాబాద్లోని బేగంపేటలో రాజీవ్గాంధీ అవమానించడంతో 1986లో రాజీనామా చేశాడు.
సుద్దాల హనుమంతు
జననం: 1908
స్వస్థలం: పాలడుగు (మోత్కూరు మండలం యాదాద్రి జిల్లా (ఉమ్మడి నల్లగొండ)
భార్య: జానకమ్మ
కుమారుడు: సుద్దాల అశోక్తేజ
పల్లెటూరి పిల్లగాడా పసులుగాసే మొనగాడా
పాలు మరిసి ఎన్నాళ్లయ్యిందో.. ఓ పాలబుగ్గల జీతగాడా.. పనులు కుదిరి ఎన్నాళ్లయిందో… (మా భూమి సినిమాలోని గేయం)
ఇతని పాటల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన పాట ఇది.
ఒక చేత్తో పెన్ను, మరో చేతితో గన్ను పట్టిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సుద్దాల హనుమంతు. ఇతని రచనలు మొత్తం వెట్టిచాకిరీ, భూస్వాములు, స్వేచ్ఛ సమానత్వం, కమ్యూనిజానికి సంబంధించినవి.
తెలంగాణ ప్రజలను తెలంగాణ సాయుధపోరాటంలో పాల్గొనేందుకు ఇతని రచనలు ఎంతో ప్రేరేపించాయి. ఈయన కుమారుడు సుద్దాల అశోక్తేజ (సమకాలీన గేయ రచయిత) కు 2003లో జాతీయ ఉత్తమ గేయ రచయిత అవార్డు లభించింది.
మల్లు స్వరాజ్యం
జననం: 1931
స్వస్థలం: కొత్తగూడెం (తుంగతుర్తి మండలం, నల్లగొండ జిల్లా)
భర్త: మల్లు వెంకట నర్సింహారెడ్డి
ఈమె చిన్నతనంలో గుర్రపు స్వారీ, కత్తియుద్ధం లాంటి విద్యల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఈమె తల్లిదండ్రులు స్వాతంత్య్రోద్యమ కాలం నాటి ‘స్వరాజ్’ అనే నినాదం పట్ల ప్రభావితులై తనకు స్వరాజ్యం అనే పేరు పెట్టారు.
ఈమె విప్లవ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన నవల మదర్ (మాక్సిమ్గోర్కీ). వెట్టిచాకిరీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ పిలుపు మేరకు ఉద్యమాలు చేసింది. వెట్టిచాకిరీ బాధితులకు బియ్యాన్ని పంపిణీ చేసింది. తర్వాతి కాలంలో జమీందారీ వ్యవస్థ వ్యతిరేక ఉద్యమంలో దళకమాండర్గా పనిచేసింది. అందుకుగాను నిజాం ప్రభుత్వం ఈమె తలకు పదివేల రూపాయల నజరానా ప్రకటించింది.
ఈమె కమ్యూనిస్టు సాయుధ పోరాట పరిధిని విస్తరించి జమీందారుల నుంచి భూమిని లాక్కొని పేదలకు పంపిణీ చేసింది. ఈమె 1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘానికి ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.
స్వామి రామానంద తీర్థ
అసలు పేరు వెంకటరావు ఖేడ్గకర్. ఇతను స్వామి రామతీర్థ రచనలతో ప్రభావితుడై ఆయన శిష్యునిగా మారి తన పేరును స్వామి రామానంద తీర్థగా మార్చుకున్నారు.
ఇతను దౌర్జన్యాన్ని ఎదురించడం అంటే దేవున్ని పూజించినట్లు అని నినదించారు. ఇతను పెట్టుబడి-శ్రమ అనే అంశంపై రాసిన వ్యాసం ఏఐటీయూసీ అధ్యక్షుడు అయిన ఎల్ఎం జోషికి నచ్చి రామానంద తీర్థను తన సహాయకునిగా నియమించుకున్నారు.
కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఉస్మానాబాద్లోని ఆదర్శపాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనలో, స్వాతంత్రోద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు.
కుమ్రం భీం
జననం: 1901 అక్టోబర్ 22
స్వస్థలం: జోడెఘాట్ (ఆసిఫాబాద్, ఆదిలాబాద్)
తల్లిదండ్రులు: చిన్నూమ్, సోంబాయి
మరణం: 1946 అక్టోబర్ 19
ఇతను నిరక్షరాస్యుడు. గోండు అనే గిరిజన జాతికి చెందినవారు. భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి వీరుల గాథలు తెలుసుకొని తన గ్రామంలో గిరిజన హక్కుల కోసం పోరాడాడు. మా గూడెంలో మా రాజ్యం అని గిరిజనులను సమైక్యపరిచి పోరాటం చేశారు.
ఈయన నినాదం జల్ (నీరు), జంగల్ (అడవి), జమీన్ (భూమి). అడవుల్లోని వనరులపై సంపూర్ణ అధికారం అడవి బిడ్డలదే అని దీని అర్థం. ఈయన గెరిల్లా యుద్ధపద్ధతిలో తిరుగుబాటు చేశారు.
భగత్సింగ్ మరణవార్త విని కలత చెంది నిజాం ప్రభుత్వపు అటవీ చట్టాలపై తిరుగబాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. కుమ్రం భీం స్థానిక తాలూక్దారైన అబ్దుల్ సత్తార్పై తిరుగుబాటు చేయగా సత్తార్ 90 మంది సాయుధ పోలీసులతో కుమ్రం భీంపై దాడి చేశారు.
జోడెఘాట్ అడవుల్లో కుమ్రం భీం నిజాం సైన్యంతో జరిగిన పోరాటంలో మరణించారు. ఈ తిరుగుబాటు తర్వాత ఇతన్ని కుమ్రం పులిగా కొనియాడారు.
-దేవపూజ పబ్లికేషన్స్ (తెలంగాణ సమాజం) సౌజన్యంతో..