Distance Education | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరం నుంచి పీజీ కోర్సులలో సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టాలని ఓయూ దూరవిద్య విభాగం అయిన ప్రొఫెసర్ జీ రామ్రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) నిర్ణయించింది. సెమిస్టర్ విధానంలో భాగంగా పీజీ కోర్సులను నాలుగు సెమిస్టర్లుగా విభజించనున్నట్టు పేర్కొన్నది. పీజీలో ఎంఏ ఆర్ట్స్, ఎంఏ సోషల్ సైన్సెస్, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి కోర్సులను ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది పీజీలో జూలై సెషన్ ప్రవేశాలకు 15 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. అయితే, సెమిస్టర్ విధానంలో ప్రవేశాలుంటాయని ఆయా నోటిఫికేషన్లో పొందుపరుస్తామని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది సమాచారహక్కు చట్టం, టీవీ యాంకరింగ్, బీకాం కంప్యూటర్స్ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్ యోగా వంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని పీజీఆర్ఆర్సీడీఈ అధికారులు నిర్ణయించారు. ఈ కోర్సులను ఈ విద్యాసంవత్సరంలో ప్రారంభించాలని యోచిస్తున్నారు. కాగా, దేశమంతటా దూరవిద్యలోనూ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను అనుసరిస్తున్నందున.. యూజీసీ సూచన మేరకు ఈ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్టు అధికారులు వివరించారు.