జాతీయ విద్యా విధానం 2020(NEP-2020)లో భాగంగా దేశంలో ఉన్నతవిద్యలో కీలక మార్పులకు యూజీసీ నడుంబిగించింది. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2022-23 నుంచి దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రవేశానికి సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUCET) నిర్వహించాలని నిర్ణయించింది. అంటే దేశంలోని 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం సీయూసెట్ను నిర్వహిస్తారు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగానే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
నూతన విద్యా సంవత్సరం నుంచి అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సీయూసెట్ ఆధారంగానే అడ్మిషన్లు నిర్వహించాల్సి ఉంటుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. ఇకనుంచి 12వ తరగతి స్కోర్లకు వెయిటేజీ ఇవ్వరు.ఈ సీయూసెట్ను NEP-2020 నిర్దేశించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది. జూలై మొదటి వారంలో పరీక్ష ఉంటుంది.
అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం సీయూసెట్ ను తప్పనిసరి పాటించాలని యూజీసీ చైర్మన్ ఎం.జగదీశ్కుమార్ స్పష్టంచేశారు. అయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం సీయూసెట్ స్కోర్ను ఉపయోగించుకునే వెసులుబాటును కలిగి ఉంటాయి.ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ తదితర 13 భాషల్లో ఆన్లైన్లో సీయూసెట్ నిర్వహిస్తారు.