హైదరాబాద్: మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి డిమాండ్ గల వృత్తివిద్యా కోర్సులు చేసినవారు న్యాయవాద కోర్సుల వైపు దృష్టిపెట్టడం అంతకంతకూ పెరుగుతున్నది. ఈ ఏడాది లాసెట్కు ఎంబీబీఎస్ పూర్తిచేసినవారు 14 మంది, బీడీఎస్ పూర్తిచేసిన వారు 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరేకాకుండా ఫార్మసీ కోర్సులు పూర్తిచేసిన వారు మరో 63 మంది దరఖాస్తు సమర్పించారు. కాగా ఇటీవలి సంవత్సరాల ట్రెండ్కు అనుగుణంగా బీటెక్లు 881 మంది దరఖాస్తు చేసుకున్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల తర్వాత బీటెక్ విద్యార్థుల దరఖాస్తులే ఎక్కువ.
లాసెట్కు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ప్రవేశాలు పొందుతున్న వారిలోను బీటెక్ అభ్యర్థులే అధికంగా ఉంటున్నారు. గత ఏడాది బీఈ, బీటెక్ పూర్తిచేసినవారు 4,136 మంది లాసెట్లో క్వాలిఫై కాగా, వారిలో 975 మంది లా కోర్సుల్లో చేరారు. ఇక బీఫార్మసీలు 211 మంది క్వాలిఫై కాగా, 65 మంది చేరారు. బీఏ పూర్తిచేసినవారు 529 మంది, బీకాం పూర్తిచేసిన వారు 965, బీఎస్సీ అర్హత గలవారు 966 మంది ప్రవేశాలు పొందారు.
మూడు, ఐదేండ్ల లా కోర్సులతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే లా, పీజీ లాసెట్కు 7,431 దరఖాస్తులు వచ్చాయి. దీంట్లో మూడేండ్ల లా కోర్సుకు 5,328 దరఖాస్తులు రాగా, ఐదేండ్ల లా కోర్సుకు 1,512 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు 582 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గడువు తేదీ జూన్ 6 లోగా దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులంటున్నారు.