ముంబై, జూన్ 5: మహారాష్ట్రలో కరోనా లాక్డౌన్ ఆంక్షల సడలింపునకు ఐదంచెల ప్రణాళికను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 3 నాటికి పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ స్థాయి ఆధారంగా సోమవారం నుంచి ఆంక్షలను ఉపసంహరించనున్నారు. ఈ విషయంలో ప్రతి మున్సిపల్ ప్రాంతాన్ని, జిల్లాను ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా పరిగణిస్తారు. ఈ మేరకు ఉద్ధవ్ ఠాక్రే సర్కారు ఒక నోటిఫికేషన్ను జారీ చేసింది. మొదటి క్యాటగిరీ కింద 5 శాతం పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 25 శాతంలోపు ఉన్న నగరాలు, జిల్లాల్లో ఆంక్షలను సడలిస్తారు. ఇలాంటి ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయి. ఉత్పత్తి, వ్యవసాయ, ఆర్థిక కార్యకలాపాలకు అనుమతి లభిస్తుంది.
5వ క్యాటగిరీ కిందకు వచ్చే నగరాలు, జిల్లాలకు మినహా ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ-పాస్ల అవసరం కానీ నిషేధాజ్ఞలు కానీ ఉండవు. 20 శాతం కంటే ఎక్కువగా పాజిటివిటీ రేటు, 75 శాతానికి మించి ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ ఉంటే ఆ ప్రాంతాలు 5వ క్యాటగిరీ పరిధిలోకి వస్తాయి. 2 నుంచి 5వ క్యాటగిరీలోకి వచ్చే నగరాలు, జిల్లాల్లో వేర్వేరు స్థాయిల్లో ఆంక్షల సడలింపు ఉంటుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు పనిచేసే వేళలు, వేడుకలు, సమావేశాలకు ఎంతమంది అతిథులు హాజరుకావచ్చు. కాగా, దేశ వాణిజ్య రాజధాని ముంబై 2వ క్యాటగిరీలోకి వస్తుంది. రెస్టారెంట్లు, మాల్స్, థియేటర్లు, మల్టీప్లెక్స్లు, ఆడిటోరియంలు, జిమ్లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే పనిచేయాలి. కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయి.
ఢిల్లీ మార్కెట్లలో సరి-బేసి విధానం
సోమవారం నుంచి ఢిల్లీలో మెట్రో రైళ్ల్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయని, మార్కెట్లు, మాల్స్లోదుకాణాలను సరి-బేసి విధానంలో తెరిచేందుకు అనుమతి ఉంటుందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. తమిళనాడు, గోవా, హిమాచల్ ప్రదేశ్లో లాక్డౌన్ను ఈ నెల 14 వరకు పొడిగించారు.