కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 10 : ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా వర్షంనీటి కాలువల ఆధునీకరణ పనులను పకడ్బందీగా చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో కుత్బుల్లాపూర్, అల్వాల్ సర్కిళ్ల డీసీలు, ఇంజినీరింగ్, జలమండలి, మండల రెవెన్యూ, ప్రాజెక్టు, టీఎస్ఎస్పీడీసీఎల్, పోలీస్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టాటెజిక్ నాలా డెవలపింగ్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్డీపీ)లో భాగంగా నగరంలోని వర్షంనీటి కాలువలను పూర్తిస్థాయిలో ఆధునీకరించే పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. నగరంలో తరచుగా ఎదురవుతున్న ముంపు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా వర్షంనీటి కాలువల పునరుద్ధరణ పనులు చేయాల్సి ఉందన్నారు.
కుత్బుల్లాపూర్, అల్వాల్ సర్కిళ్ల పరిధిలోని ఫ్యాక్స్సాగర్ నుంచి కెమికల్ నాలా వరకు, కోల్ కాలువ నుంచి కెమికల్ నాలా మీదుగా వెన్నులగడ్డ చెరువు వరకు వర్షంనీటి కాలువలను ఆధునీకరించాలని జడ్సీ అన్నారు. ఈ ప్రాంతాల్లో వర్షంనీటి ప్రవాహానికి అడ్డంకులను గుర్తించడం, వాటిని తొలగించి కాలువలను పూర్తిస్థాయిలో విస్తరించే పనులను చేయాలన్నారు. దీనికోసం డిప్యూడీ కమిషనర్, తాసీల్దార్, సెక్షన్ హౌస్ ఆఫీసర్ (సీఐ), ఎన్ఎన్డీపీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్, మెయింటెనెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్, జలమండలి జీఎం, టీఎస్ఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజినీర్, ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు కలిసి వర్షంనీటి కాలువలను పరిశీలించి నివేదికను సిద్ధం చేయాలన్నారు. కాలువలను విస్తరించేందుకు పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని.. ప్రతీ గురువారం ఈ బృందం సభ్యులు సమావేశం కావాలన్నారు. ముంపు సమస్యలను పరిష్కరించేలా భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేయాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు.