బెంగళూర్ : ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి మహిళపై దాడి చేసిన జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ను బెంగళూర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఫుడ్ డెలివరీ ఆర్డర్లో జాప్యం చేసినందుకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో మహిళపై బుధవారం నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మహిళ ముక్కు ఎముక విరిగిపోయింది. మహిళపై దాడికి పాల్పడిన జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ను కామ్రాజ్గా పోలీసులు గుర్తించారు. బెంగళూర్ మహిళపై దాడికి పాల్పడిన జొమాటో డెలివరీ బాయ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని నగర డీసీపీ జోషీ శ్రీనాథ్ వెల్లడించారు.
ఈ ఘటనపై బాధితురాలు హితేష చంద్రానీని జొమాటో క్షమాపణలు కోరింది. ఆమెకు ఎదురైన చేదు అనుభవం పట్ల తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆమెను క్షమాపణలు కోరుతున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆమెకు వైద్య సాయం అందించడంతో పాటు పూర్తిగా బాసటగా నిలుస్తామని వెల్లడించింది. ఈ ఘటన అనంతరం తనకు ఎదురైన అనుభవాన్ని మేకప్ ఆర్టిస్ట్గా పనిచేసే హితేష చంద్రానీ తన ఇన్స్టాగ్రాం ఖాతాలో వివరించారు.