హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన రెండో భార్య షమీమ్ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు రికార్డుచేశారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన మూడు పేజీల స్టేట్మెంట్లో సంచలన విషయాలు ఉన్నాయి. ఈ స్టేట్మెంట్లో వైఎస్ భాస్కర్రెడ్డి, అవినాశ్రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు. 2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు వివాహం జరిగిందని షమీమ్ తెలిపారు.
2015లో తమకు షెహన్ షా (కొడుకు) జన్మించినట్టు పేర్కొన్నారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతారెడ్డి బెదిరించేదని, హత్యకు కొన్ని గంటల ముందు వివేకా తనతో ఫోన్లో మాట్లాడారని చెప్పారు. బెంగళూరు భూ సెటిల్మెంట్లో రూ.8 కోట్లు వస్తాయని వివేకా చెప్పారని వెల్లడించారు. తమ వివాహం వివేకా కుంటుంబసభ్యులకు ఇష్టం లేదని, తమను దూరం పెట్టారని ఆమె వివరించారు.