కాంగ్రెస్, బీజేపీలు తమతో జత కట్టని ప్రాంతీయ పార్టీలపై ‘బీ’ టీమ్గా ముద్ర వేస్తుంటాయి. అవే చిన్నా చితక పార్టీలను అయితే ముద్దుగా ‘సీ’ టీమ్లని పిలుస్తాయి. వైఎస్ షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ల పార్టీలు బీజేపీకి ‘సీ ’టీమ్లనే ముద్ర పడింది. షర్మిలపై ఇప్పటికే బీజేపీ వదిలిన బాణమన్న ఆరోపణలున్నాయి. వీటిని ఆమె ఖండించినప్పటికీ తాజాగా మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం చూస్తే బీజేపీకి ‘సీ’ టీమ్ అనేది తేలిపోయినట్టేనని ఆ పార్టీ వారే వాపోతున్నారు.
మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తమ కుటుంబానికి సన్నిహితుడు కావడం వల్ల అక్కడ పోటీ చేయడం లేదని పార్టీ నేతలకు షర్మిల ఇటీవల చెప్పడంతో బీజేపీకి తాము ‘సీ’ టీమేనని తమకు కూడా ఒక స్పష్టత వచ్చిందని వారంటున్నారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు బీజేపీ అగ్రనేతలతో షర్మిల రహస్య భేటీ కానున్నారని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో (బీజేపీ రాష్ట్ర కార్యాలయం-నాంపల్లి) కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.