వాడెవడో ఎక్కన్నుంచో వచ్చి కేసీఆర్ను జైళ్ళో పెడతామంటాడు. పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టి చిత్తుచిత్తుగా ఓడిపోయినోడు తెలంగాణ.. వరి అన్నం అంటూ సొల్లుమాటలు మాట్లాడుతాడు. ఇంట్లో వదిన ఈడ్చి తంతే తెలంగాణల వచ్చి పడ్డ మరదలు కేసీఆర్ను పట్టుకొని 420 సీఎం అంటది. మంత్రులను గూండాలని అంటది. గుంపులేసుకొని తిరిగే గుండుబాస్ కేసీఆర్ను గద్దె దింపేస్తా అంటడు. లీడరో, జోకరో తెలియని ఇంకొకడు నేను శాపం పెట్టిన… కేసీఆర్ పదవి పోతదని అంటడు. పనీపాటా లేనోడొకడు తెలంగాణ మత్తులో మునుగుతుంది, డేంజర్ జోన్లోకి వెళ్తుందంటాడు.
ఎవరు వీళ్లంతా?
తెలంగాణతో వీళ్లకేం సంబంధం? ఇక్కడ పుట్టారా? ఇక్కడ పెరిగారా? ఎన్నడన్నా మేం తెలంగాణ వాళ్లం అని చెప్పుకొని తిరిగారా? తెలంగాణ కోసం పోరాటం చేశారా? ఇక్కడ ప్రజలతో కలిసి జీవించిన వారా? ఇక్కడి కష్టాల్లో పాలుపంచుకున్న వాళ్లా?
తెలంగాణ పుట్టుకను హర్షించని.. తెలంగాణ ప్రగతిని జీర్ణించుకోని.. తెలంగాణ పచ్చబడ్డా చూడలేని ఈ గుంపు హఠాత్తుగా తెలంగాణ మీద ఎందుకు పడుతున్నది. తెలంగాణ ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో చెప్పడానికి వీళ్లెవరు? అక్కడ ఆస్తులు లాక్కుంటే.. అక్కడ పదవులు రాకపోతే ఇక్కడ రాజకీయాలు చేస్తారా? తెలంగాణ అంత పుక్యానికి దొరికిందా?
తెలంగాణకు ఇవాళ ఓ కొత్త బెడద మొదలైంది. ఈ గడ్డతో ఏ సంబంధం లేని వాళ్లు ఇక్కడి ప్రశాంతతను భగ్నం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. పాదయాత్రలు, మోకాళ్ల యాత్రలు అంటూ పాతిక యాభై మంది బౌన్సర్లను వెంటేసుకొని రోడ్ల మీద పడుతున్నారు. అడ్డం కాదు, పొడుగు కాదు అన్నోడు అడ్రస్ లేకుండా పోయినా ఆ వారసులు అడ్డం పడటానికి మళ్లీ తయారయ్యారు. పచ్చమీడియా వత్తాసుతో చెలరేగిపోతున్నారు. నోటికొచ్చిన కారుకూతలకు దిగుతున్నారు. చూసీచూడనట్టు వదిలేసినా తొడలు గొట్టి రంకెలేస్తున్నారు. శాంతిభద్రతలను సవాల్ చేస్తున్నారు. ఉచ్ఛం లేదు.. నీచం లేదు. నోటికి ఎంతొస్తే అంత.. ఏదొస్తే అది. కళ్ల ముందు కళకళలాడే చెరువులు, చేలను పెట్టుకొని రైతులు అల్లాడిపోతున్నారంటూ దొంగ ఏడ్పులు.. ఇప్పటికే రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంటే ఒక్క ఉద్యోగమూ రాలేదని సిగ్గు లజ్జా లేని బొంకులు. పేదలు, దళితులు, బడుగులు అంటూ తెలంగాణలో ఏవో ఘోరాలు జరుగుతున్నట్టు శోకాలు. ‘దమ్ముంటే రా’ అంటూ రెచ్చగొట్టడాలు. ‘మెడలు వంచుతాం.. గల్లా పట్టుకుంటాం.. దింపేస్తాం.. పాతరేస్తాం..’ వంటి హెచ్చరికలు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను, చట్టాల్లో ఉన్న వెసులుబాటులను ఆసరాగా చేసుకొని పేట్రేగిపోతున్నారు. ఏం చేసైనా తెలంగాణను దెబ్బ కొట్టాలనే ప్రయత్నం. ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలుచేయాలి.. కేసీఆర్ను ఓడించాలి.. తెలంగాణలో మళ్లీ జెండా పాతాలి.. ఇదే వారి ఏకైక లక్ష్యం. పచ్చ మీడియాను వారధిగా చేసుకొని సాగే ఈ కుట్రను తెలంగాణ సహించదు, సాగనివ్వదు. దశాబ్దాల పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణను ఆగం కానివ్వదు. రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర తెలంగాణది. ఈ మూకలను కూడా తరిమి తరిమి కొట్టి తీరుతుంది.
స్వరాష్ట్రం భగ్నం చేయడానికే..
అదేంటో తెలంగాణ అందరికీ పుక్యానికి దొరికింది. మీ పెత్తనం మాకొద్దే వద్దు అని తెగేసి చెప్పి స్వరాష్ట్రం తెచ్చుకున్నాక చంద్రబాబు జాతీయపార్టీ పేరుతో పాగా వేయాలని యత్నించాడు. హైదరాబాద్లోనో, ఖమ్మంలోనో అడ్డా వేయాలని చూశాడు. తెలివిగల్ల తెలంగాణ ఆ ప్రయత్నాలను వమ్ముచేసి తరిమేసింది. ఆ తర్వాత మరో రూపంలో ఇంకొందరు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. తాజాగా షర్మిల పార్టీ పేరిట, పాదయాత్ర పేరిట పాగా వేయాలని యత్నిస్తున్నది. తెలంగాణలో ఆమెకేం పని? ఆమె ప్రాంతం తెలంగాణ కాదు. ఆమె రాజకీయం తెలంగాణ కాదు. ఆ కుటుంబానికి బెంగళూరుతో ఉన్న సంబంధాలతో పోలిస్తే తెలంగాణతో సంబంధాలు లేనే లేవు. వైఎస్ సీఎం కాబట్టి ఇక్కడ కొంతకాలం ఉండటం తప్ప అన్నా చెల్లెళ్లు ఉన్నదంతా బెంగళూరులోనే. వాళ్ల వ్యాపారాలు, వ్యవహారాలు జరిగిందీ అక్కడే. సరే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రాజకీయం చేసి.. అక్కడ ఏదో తేడా వచ్చి దూరం పెట్టేదాన్క తెలంగాణ అన్న పదమైనా పలికింది లేదు. తెలంగాణలో తిరిగిందీ లేదు. అక్కడ పోగొట్టుకున్నదేదో ఇక్కడ చూసుకోవడానికి రాజకీయ పార్టీ అంటూ నాటకాలకు తెరదీసింది. అసలు షర్మిలకు తెలంగాణ ఎప్పుడు గుర్తుకువచ్చింది? అన్న ఆస్తులు ఇవ్వకపోతే, పదవులు నిరాకరిస్తే గుర్తుకువచ్చింది. పార్టీలో తల్లి పదవి లాగేసుకుంటే గుర్తుకువచ్చింది. గతంలో తామే పాకిస్థాన్ అని అభివర్ణించిన తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా నిరసించిన విషయం మరిచిపోయి మాతా సుతలు జామాతా సమేతంగా తెలంగాణ మీద పడ్డారు. ఆంధ్రాలో పార్టీ ఎందుకు పెట్టలేదని అడగాల్సిన అవసరం లేదు. అక్కడ ప్రతిపక్షాలకు జరుగుతున్న సన్మానాలు చూశాక ఆ ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ ఆ ధైర్యం చేయలేదు. తెలంగాణ ఒకటి పుక్యానికి దొరికింది. కాబట్టి ఇక్కడ పడ్డారు.
ఆడ బిడ్డా.. అక్కడి బిడ్డా?
ఇవాళ ఆడబిడ్డ మీద కేసు పెట్టారు అంటూ రాగాలు తీస్తున్న షర్మిలకు తెలంగాణ మీద తెలంగాణ ప్రజల మీద ఉన్న గౌరవమెంత? ఇందిరా పార్కు వేదిక మీద ఒక తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని గాడిదలు కాస్తున్నావా అని మైకులోనే ఈసడించింది ఆవిడ కాదా? ఒక ఆడబిడ్డకు అందునా పార్టీలో మహిళా నాయకురాలికి ఇచ్చే గౌరవం అదేనా? నాటి నిరసనకు నమ్మి వచ్చి వేదికనెక్కిన నాయకులను చూపుడు వేలు పెట్టి చూపుతూ వీళ్లందరినీ ఖాళీ చేయించండని చెప్పిన మాట. అది విని ఆ నాయకులు సిగ్గుతో సగం చచ్చిన విషయం నిజం కాదా? పాదయాత్ర పేరు మీద రాష్ట్రం మీద పడి ప్రజలెన్నుకున్న నాయకులను, ఎమ్మెల్యేలను నోటికి వచ్చిన పదజాలంతో దూషించడం నిజం కాదా? ఎమ్మెల్యేలు, మంత్రులను పట్టుకొని గూండాలు, రౌడీలు, రాజకీయ వ్యభిచారులని నోరు చేసుకోవడం ఒక ఆడబిడ్డ చేసే పనేనా? చేయాల్సిన పనేనా? ఆడబిడ్డలాగా వ్యవహరిస్తే ఆడబిడ్డలాగా ఆదరిస్తారు. అక్కడి బిడ్డలాగ ప్రవర్తిస్తే అక్కడికే తరిమేస్తరు.
తెలంగాణ అంటే తాగుడేనా?
షర్మిలకు తెలంగాణ అంటే ఎంత ప్రేమ… ఏనాటి ప్రేమ? ఆమె దృష్టిలో తెలంగాణ అంటే తాగుడు.. తాగుబోతులే. ఆమె పాదయాత్రలో లెక్కలేనన్ని సార్లు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. లిక్కర్ తెలంగాణ చేశారు (మునుగోడు, చండూరు). బంగారు తెలంగాణ కాదు… బార్లు బీర్ల తెలంగాణ (భూపాలపల్లి). తాగడానికి నీళ్లు లేకున్నా పుష్కలంగా బార్లు(గరిడేపల్లి). రాష్ట్రమంతా మద్యం దుకాణాలే ఉన్నాయి (పెన్పహాడ్).. వగైరా స్టేట్మెంట్లు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆమెకు ఏ రాష్ట్రంలోనూ కనిపించని మద్యం తెలంగాణలోనే కనిపిస్తున్నది. రాష్ట్రమంతా తాగుబోతులే కనిపిస్తున్నారు. ఏపీలో బెల్ట్షాపులు లేవా? లిక్కర్ షాపులు లేవా? లిక్కర్ ఆదాయం ఏమన్నా తక్కువా? మరి తెలంగాణలోనే లిక్కర్ ఎందుకు కనిపిస్తున్నది. అప్పుడెప్పుడో బొత్స సత్యనారాయణకు ఇలాగే తాగుడు అంటగడితే ఆయన అన్నాడు… ‘మీ నాన్న నీసు ముట్టకుండా, తాగకుండా పడుకున్న రోజుందా?’ ఎందుకు మమ్మల్ని గెలికి తిట్టించుకుంటావ్’.. అని.
రాష్ట్రం తెచ్చిన సీఎం మీద..
దేశంలో అనేక రాష్ర్టాలున్నాయి, సీఎంలున్నారు. కానీ తెలంగాణకు రాష్ర్టాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు. పద్నాలుగేండ్లు ఉద్యమం నడిపి ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసి రాష్ర్టాన్ని సాధించిన సీఎం ఉన్నారు. తొలి సీఎంగా ఈ రాష్ర్టానికి రూపురేఖలు తీర్చిదిద్దిన సీఎం ఆయన. ప్రజలు మెచ్చి రెండోసారి గెలిపించిన సీఎం ఆయన. ఇక్కడి పాలన, పథకాలు దేశానికి ఆదర్శప్రాయంగా మార్చిన ముఖ్యమంత్రి ఆయన. అనేక రంగాల్లో రాష్ర్టాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపిన సీఎం ఆయన. ఇక్కడి పాలన మెచ్చి పక్కరాష్ర్టాల గ్రామాలు తమను తెలంగాణలో కలపమని కోరే పాలన అందించిన సీఎం ఆయన. 119 అసెంబ్లీ సీట్లలో 90 సీట్లు గెలిచిన, మొత్తానికి మొత్తం జడ్పీలు గెలిచిన సీఎం ఆయన. అలాంటి సీఎంను పట్టుకొని 420 సీఎం అని, గూండా సీఎం అని, ఫాంహౌజ్ సీఎం అని కారుకూతలు కూస్తే ప్రజలు తిరగబడతారు.
ఛీ కొట్టినా…
నిరుద్యోగ సమస్య పేరుతో షర్మిల చాలా కతలు పడ్డది. మరి వైఎస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అసలు భారీ ఉద్యోగ నియామకాలేమైనా జరిగాయా? వైఎస్ గనుక చాలినంత ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈ ఎనిమిదేండ్లలో ఈ నిరుద్యోగులు పుట్టుకువచ్చారా? అవన్నీ మరిచి తెలంగాణ వచ్చాకే నిరుద్యోగులు పుట్టుకువచ్చినట్టు షర్మిల హాహాకారాలు ప్రారంభించింది. కొంతమంది అమాయకుల ఇండ్లకు వెళ్లి కతలు పడింది. కానీ నాటకాలు అన్నివేళలా ఫలించవు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ఓ గ్రామానికిదే కారణంతో వెళ్లాలని యత్నించింది. అయితే తెలంగాణ స్పృహ కలిగిన ఆ కుటుంబం ఈమెను ఛీ కొట్టింది. ఇంటికి రావద్దని వార్నింగ్ ఇచ్చింది. కంగుతిన్న ఈ నాయకురాలు మరోచోట దీక్ష పేరిట డ్రామా చేసి పరువు దక్కించుకున్నది.
పరువు తీసిన కర్నూల్ కూలీలు
పాలమూరు పర్యటనలో పత్తి చేలలో కూలీలు కన్పించగానే మాటల్లో పెట్టి లబ్ధి పొందాలనుకున్నది. అయితే వాళ్లు తమది కర్నూలు జిల్లా అని అక్కడ పరిస్థితులు బాగోలేక ఇక్కడికి వలస వచ్చామని ఇక్కడ బాగుందని అమాయకంగా చెప్పేసరికి తెల్లమొహం వేసి తిరుగుముఖం పట్టింది. సోషల్ మీడియాలో
ఇది వైరల్గా మారింది.
ఎవరు నేత? ఎంత మేత?
తెలంగాణలో వైఎస్ సంక్షేమ పాలన తెస్తుందట! నాటి వైభవం తిరిగి తీసుకువస్తుందట.! కేసీఆర్ పాలన అవినీతిమయంగా మారిందట! అవును, అవినీతి గురించి మీ కుటుంబమే మాట్లాడాలి. పాలనా వైభవం గురించి మీ పాలన గురించే చెప్పాలి. అనేక రాష్ర్టాల్లో అవినీతి జరిగి ఉండవచ్చు. కొందరు నాయకులు జైలుపాలై ఉండవచ్చు. కానీ మహా మేత హయాంలో అర డజనుకు పైగా ఐఏఎస్లే జైలు పాలయ్యారు. వాళ్ల సగం జీవితం జైళ్లు, కోర్టుల మధ్యే గడిచిపోయింది. ఆయనతో కలిసి పనిచేసిన పాపానికి తెలంగాణ మాజీ మంత్రులు ఇంకా కోర్టుల మెట్లెక్కుతూనే ఉన్నారు. లక్ష కోట్ల అవినీతి అని మీడియా కోడై కూసింది. దొంగ కంపెనీలు, సూట్కేసు కంపెనీలు, క్విడ్ ప్రోకోలు విశ్వరూపం చూపించాయి. హైదరాబాద్లో వందల ఎకరాలు రాత్రికి రాత్రే సీమ గూండాల పాలయ్యాయి. భూముల రక్షణకు రౌడీల కాపలా వైభవం ఎవరి హయాంలో ప్రారంభమైంది? రాజధాని నడిబొడ్డున ఫాక్షన్ హత్యలు చోటుచేసుకున్నాయి. జైళ్లో సాక్షులు జైళ్లోనే హతమయ్యారు. సీమలో వరుసగా ప్రత్యర్థులను నరికేసుకుంటూ పోయారు. ఆ పాలనావైభవం వర్ణించతరమా! కాళేశ్వరంలో అవినీతి జరిగిందట… అంచనాలు భారీగా పెంచేశారట… అవును మరి. జలయజ్ఞం, ధనయజ్ఞంగా మారింది ఎవరి హయాంలో. గుప్పెడు మట్టి తీయకముందే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కోట్లు కుమ్ముకుంది ఎవరి హయాంలో.. కాలువలు తవ్వకముందే పైపులు కొని పారేసింది ఎవరి హయాంలో? కుటుంబ సభ్యులకు బయ్యారం గనులు ధారాదత్తం చేయాలని చూసిందెవరి హయాంలో? వోక్స్వ్యాగన్ను లంచాలకు పీడించి రాష్ట్రం నుంచి పారదోలింది ఎవరి హయాంలో? సముద్ర తీరాలను ప్రైవేటు ఆస్తులుగా మార్చిందెవరి హయాంలో? ఈ వైభవమా తెలంగాణకు కావలసింది?
తెలంగాణ విద్రోహి..
తెలంగాణ ప్రయోజనాలకు శాశ్వతంగా గండి కొట్టే పులిచింతల, పోతిరెడ్డిపాడు కట్టిన తెలంగాణ విద్రోహి పాలన మాక్కావాలా? పులిచింతల నీళ్లు పారాయి. పోతిరెడ్డిపాడు నదినే మళ్లించింది. పోలవరం ప్రధాన పనులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రాకు విజయవంతంగా నీళ్లు మళ్లించి తెలంగాణకు మాత్రం ప్రాణహిత పేరుతో కొందరు నేతలకు కుక్కలకు బొక్కలు వేసినట్టు కాంట్రాక్టులు పడేసి డబ్బా కొట్టించుకున్నాడు తప్ప కనీసం బ్యారేజీ కట్టలేదు. ఒక్క చుక్క నీరు తెలంగాణకు రాలేదు.
ఆర్డీఎస్ నీళ్లు సీమ మళ్లించుకున్నది. పాలమూరు ఎండిపోయింది. హైదరాబాద్ను శాశ్వతంగా తెలంగాణకు దూరం చేయడానికి, తెలంగాణ వచ్చినా తమ పెత్తనం పోకుండా ఉండటానికి నగర పాలన పరిధిని పెంచాడు. కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్ను ఓడించడానికి డబ్బుల బస్తాలు దింపాడు. తెలంగాణ ఉద్యమం గొంతు నులమడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మళ్లించుకున్నాడు. తెలంగాణ ఇస్తే బెంగళూరుకు వెళ్లిపోతానని సోనియాను బెదిరించాడని మాజీ రాష్ట్రపతే స్వయంగా చెప్పారు.
సీఎంను చేసిందే తెలంగాణ
వైఎస్ ఉంటే తెలంగాణ వచ్చేది కాదు అంటూ కొందరు సొల్లు కబుర్లు చెప్తారు. కానీ అసలు వైఎస్ సీఎం అయ్యిందే టీఆర్ఎస్ పార్టీ పొత్తు వల్ల. ఎప్పుడో ఎన్టీఆర్ ఉన్న కాలంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇందిర హత్యానంతర సానుభూతి ప్రభంజనంలో కూడా కాంగ్రెస్ను గెలిపించుకోలేకపోయారు మన మహామేత. ఎంపీ ఎన్నికల్లో తన సొంత ప్రాంతం సీమలో ఒక్కటంటే ఒక్క సీటు గెలువలేదు. కాంగ్రెస్కు ఒకటి రెండు సీట్లు ఇచ్చింది తెలంగాణే. అదీ మన మహా మేత సారథ్యం.
ఆ తర్వాత చంద్రబాబుతో పోటీ పడి అసెంబ్లీలో 22 సీట్లకే పార్టీని పరిమితం చేసిన ఘనతా మన మేతదే. చివరికి ఉచిత విద్యుత్ నినాదంతో బాబును ఎదుర్కొన్నా అధికారం దక్కలేదు. ఆశలు వదిలేసుకున్న శివశంకర్ లాంటి నేతలు కూడా ఎన్నికలకు ముందు బాబును కలిశారన్న వార్తలు వచ్చాయి. బాబు దెబ్బకు దివాళా స్థితికి చేరినప్పుడు తెలంగాణ ఉద్యమమే కాంగ్రెస్కు ఊపిరినిచ్చింది. టీఆర్ఎస్ పోత్తే లేకుంటే అప్పుడు కాంగ్రెస్ ఖాళీ అయ్యేదే. ఆ పొత్తు ఇచ్చిన ఊపు ఉమ్మడి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఫలించి కాంగ్రెస్ గెలిస్తే ఈయన సీఎం అయ్యాడు. లేకుంటే ఇడుపులపాయలో ఈగలు తోలుకునేవాడు.
‘రైతుబంధు’ ముష్టి అట..
కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పేరిట రైతులను మోసగిస్తున్నదట! ఎకరానికి రూ.5 వేలు ముష్టి వేసి వేల రూపాయల నష్టం చేసిందట! ఎరువులు, పురుగుల మందుల ధరలు పెంచిందట. వ్యవసాయ పరికరాల ధరలూ పెంచేసిందట. ఎరువుల ధరలు ఎవరి చేతిలో ఉంటాయి? పురుగుల మందుల ధరలు ఎవరు నిర్ణయిస్తారు? దానితో రాష్ర్టానికేం సంబంధం.
పాపం స్క్రిప్ట్ రైటర్కు తెలిసినట్టు లేదు. అంతేకాదు, వైఎస్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలన్నీ కేసీఆర్ రద్దు చేశారట. ఆయన ఏం పథకాలు పెట్టారో ఈవిడకే తెలియాలి. ఉచిత విద్యుత్ పేరే గాని వ్యవసాయానికి ఎన్ని గంటల విద్యుత్ ఇచ్చారో ఈవిడకు తెలిసినట్టు లేదు. ఆయన హయాంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా తెలిసినట్టు లేదు.
విచిత్రంగా గవర్నర్ తమిళి సై గంట వ్యవధిలోనే షర్మిలకు మద్దతుగా ప్రకటన చేస్తారు. ఏ సంబంధం లేకపోయినా బీజేపీ నేతలు మద్దతుగా వస్తారు. పచ్చ మీడియా ఏదో ఘోరం జరిగినట్టు చిత్రిస్తుంది. ఢిల్లీ నుంచి ఈ ఘటనల మీద వాకబులు మొదలయ్యాయి. విషయం అర్థం కావడం లేదూ!