ర్రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
క్రృషి భవన్ ప్రతిభ ఫౌండేషన్ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిళ్ల సందర్శన
“నిరుద్యోగ యువత కలల సాకారానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నది. మునుపెన్నడూలేని విధంగా లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు ఉచితంగా కోచింగ్ కూడా ఇస్తున్నది. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. నియామకాలు అత్యంత పారదర్శకంగా చేపడతాం. స్థానికులకే జాబ్స్ దక్కాలనే ఉద్దేశంతో నూతన జోనల్ వ్యవస్థను తేవడంతోపాటు పైరవీలకు తావులేకుండా ఉండాలనే ఇంటర్వ్యూలను సీఎం కేసీఆర్ రద్దు చేశారు. యువత కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలి.
– ప్రతిమ ఫౌండేషన్, ఎస్సీ స్టడీ సర్కిల్ సందర్శనలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
కమాన్చౌరస్తా, మే 25: నిరుద్యోగ యువతకు రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నదని, కొలువుల కల సాకారానికి లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉద్ఘాటించారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలనే సకల్పంతో నూతన జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని చెప్పారు. బుధవారం కరీంనగర్ నగరంలోని కలెక్టరెట్ రోడ్డులో ఉన్న కృషి భవన్ ప్రతిమ ఫౌండేషన్ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిళ్లను మేయర్ సునీల్రావు, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్ రావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత నాలుగేళ్లుగా తన సొంత ఖర్చులతో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, నోటిఫికేషన్ల నేపథ్యంలో ఈ ఏడాది దాదాపు 150 మంది నిరుద్యోగ యువతి యువకులకు కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ శిక్షణ తీసుకుంటున్న ప్రతిమ ఫౌండేషన్ అభ్యర్థులు మంచి ప్రతిభచూపి కొలువులు సాధించాని ఆకాంక్షించారు. విద్యార్థులు కోరినట్లుగా కృషి భవన్లో ఇంకా కొంత అదనంగా స్థలం కేటాయిస్తే మరి కొంత మంది అభ్యర్థులకు కోచింగ్ అవకాశం ఇస్తామని చెప్పారు. నైపుణ్యం ఉన్న టీచర్లను కేటాయించి శిక్షణ అందించడంతో పాటు కావల్సిన స్టడీ మెటీరియల్ను కూడా అందిస్తామని చెప్పారు. యువతి యువకులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉచిత శిక్షణ కేంద్రాలతో పాటు ప్రతిమ ఫౌండేషన్ స్టడీ సర్కిల్ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఉద్యోగ అవకాశాల్లో పైరవీలకు తావులేకుండా ఉండాలనే ఆలోచనతో ఇంటర్వ్యూను తొలగించారని, ప్రతిభను నమ్మకొని మంచి మార్కులు సాధించిన వారికే జాబ్స్ వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఇక్కడ శిక్షణ తీసుకునే అభ్యర్థులకు మున్సిపల్ కార్పొరేషన్, మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఉచిత మధ్యాహ్న భోజనం, ఎండాకాలం ముగిసే దాకా కరీంనగర్ డెయిరీ సహకారంలో మజ్జిగ లేదా లస్సీ అందిస్తామని చెప్పారు. అనంతరం స్టడీ సర్కిల్లోని అభ్యర్థులతో మాట్లాడారు. బోధన విధానం, కావాల్సిన ఇతర వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం పుస్తకాలు కావాలని ఆయన్ను కోరగా, హైదరాబాద్లో ఎంపిక చేసిన పుస్తకాలను ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్వరలో అందిస్తామని హామీ ఇచ్చారు. మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ వినోద్కుమార్ సూచనల మేరకు కృషి భవన్లో ప్రిపేరయ్యే అభ్యర్థులు 150 మందికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు. అభ్యర్థులకు మరుగు దొడ్ల వసతి సౌకర్యంతో పాటు ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పించి శిక్షణ అందిస్తామని వివరించారు. ఇక్కడ కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు, నాయకులు వీర్ల వెంకటేశ్వర్ రావు, జక్కుల నాగరాజు, మల్లికార్జున్, సంపత్, విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు.
ఎంతో ఉపయోగకరంగా ఉన్నది..
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టడీ సర్కిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువుకుంటున్నాం. బయట ప్రైవేటు స్టడీ సెంటర్లలో ఫీజులు చెల్లించే పరిస్థితి లేక ఇక్కడికి వస్తున్నాం. ప్రతి రోజూ 15 న్యూస్ పేపర్లతోపాటు, ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మా ప్రిపరేషన్కు దోహదపడుతున్నాయి.
– సుప్రియ, కొత్తగూడెం
మంచి అవకాశంగా భావిస్తాం..
మూడు నెలల నుంచి ఇక్కడ చదువుకుంటున్నాం. రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రిపేరవుతున్నాం. అన్ని సౌకర్యాలున్నాయి. ఈ రోజు వినోద్కుమార్ సార్ వచ్చి మధ్యాహ్నం భోజనం, మజ్జిగ అందజేసి మాకు సహకారం అందిస్తామనడం సంతోషంగా ఉంది. అవసరమైన పుస్తకాలు సైతం అందిస్తానని చెప్పారు. సార్కు చాలా థ్యాంక్స్. – శేఖర్, కొత్తూరు, ధర్మారం