దేవరకొండ, జనవరి 10: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. గ్రామ సమీపంలోని మెట్టు మహంకాళి దేవాలయం విగ్రహం వద్ద మొండెం నుంచి వేరుచేసిన యువకుడి తల తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం కాలనీవాసులు మొండెం లేని యువకుడి తలను గుర్తించి పోలీసులకు సమచారం ఇచ్చారు. దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి, నాంపల్లి సీఐ సత్యం పరిశీలించారు. డాగ్స్క్వాడ్, క్లూస్టీంలతో ఆధారాలను సేకరించారు. మృతుడిని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్కు చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ రమావత్ శంకర్నాయక్ కుమారుడు జయేందర్ (30)గా గుర్తించారు. అతను డిగ్రీ వరకు చదువుకోగా మానసిక సమస్యలతో రెండేండ్లుగా గ్రామానికి రావట్లేదు. గతంలో ఎర్రగడ్డ హాస్పిటల్లో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు వదిలివేసినట్టు సమాచారం. అతని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జయేందర్ హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.