సూర్యాపేట : జిల్లాలోని కోదాడ సమీపంలో జాతీయ రహదారి 65పై శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కె.అన్వేశ్(27), గాయపడ్డ వ్యక్తిని రాహుల్గా గుర్తించారు. బాధితులు సిద్దిపేట జిల్లా అక్కినపల్లి మండలం తెలుగుపల్లి గ్రామవాసులుగా సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వాహనం శుక్రవారం ఉదయం సరుకు రవాణా ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇద్దరు యువకులు వారి సరుకు రవాణా ఆటోలో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నారు. కోదాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వాహన గుర్తింపునకు చర్యలు చేపట్టారు.