రెంజల్, నవంబర్ 26: యువత గంజాయికి బానిసలై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీపీ కార్మికేయ అన్నారు. గంజాయిని పూర్తిగా నిషేధించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. రెంజల్ పోలీసుస్టేషన్ను ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో గంజాయి వ్యసనానికి అలవాటుపడిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యుల సహాయంతో కౌన్సెలింగ్ నిర్వహించాలని ఎస్సైకి ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి విధించిన చలాన్లు ఈనెలాఖరు వరకు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో రెండేండ్లుగా నేరాలు అదుపులో ఉన్నాయని, ప్రమాదాలు, నేరాల నియంత్రణకు సిబ్బంది బాగా పనిచేస్తున్నారని సీపీ అభినందించారు. జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వంద శాతం వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. రెంజల్ పోలీసుస్టేషన్ కంప్యూటర్ ఆపరేటర్, సిబ్బంది విధుల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారని, వారికి త్వరలోనే రివార్డులను అందజేస్తామని ప్రకటించారు. ఆయన వెంట అదనపు డీసీపీ స్వామి, బోధన్ రూరల్ సీఐ బి.రవీందర్నాయక్, రెంజల్ ఎస్సై మురళి ఉన్నారు.