మీరు ఉద్యోగం చేస్తున్నారా?.. ఎల్ఐసీలో పాలసీ ఉందా?.. కరోనా నేపథ్యంలో బీమా ప్రీమియంలు చెల్లించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారా?.. అయితే ఇకపై నిశ్చింతగా ఉండొచ్చు. మీ ఎల్ఐసీ పాలసీ ప్రీమియంను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) చెల్లిస్తుంది. అవును.. ఎలాగో తెలుసుకోండి మరి.
బీమా అనగానే మనలో ఎంతోమంది ఎల్ఐసీవైపే చూస్తాం. కారణం.. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి. ఎల్ఐసీ పాలసీ తీసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉండవన్న భరోసా కూడా చాలామందిది. అయితే కరోనాతో మనందరి ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ముఖ్యం గా వేతనజీవుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎందరికో ఉద్యోగాలు, ఉపాధి కరువైంది. ఈ క్రమంలో కొందరు ఎల్ఐసీ పాలసీ ప్రీమియంలనూ చెల్లించలేని స్థితిని ఎదుర్కొంటున్నారు. మీకూ ఇదే సమస్య ఉంటే ఈపీఎఫ్ ఖాతా సాయం తో ప్రీమియం సొమ్మును సులభంగా చెల్లించుకోవచ్చు.
ఈపీఎఫ్వో సాయం ఎలా తీసుకోవచ్చు?
ఈపీఎఫ్ స్కీం 1952 ప్రకారం ఈపీఎఫ్ ఖాతాదారులు తమ జీవిత బీమా పాలసీకి ఈపీఎఫ్ అడ్వాన్స్ ద్వారా చెల్లింపులు జరుపవచ్చు. అయితే ముం దుగా ఈపీఎఫ్ కార్యాలయానికి ఈ సమాచారం అందించాలి. అలాగే ఈపీఎఫ్వోకూ తెలియజేయా ల్సి ఉంటుంది. ఈ మేరకు ఫామ్ 14లో వివరాలన్నింటినీ సమర్పించాలి. ఈ ఫామ్ 14 ఈపీఎఫ్వో వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి మీ దరఖాస్తు ఆమోదం పొందినైట్లెతే, ఆ తర్వాత మీ ఈపీఎఫ్ ఖాతా నుంచే వాయిదా తేదీ రాగానే దానంతటదే ప్రీమియం చెల్లింపులు జరిగిపోతాయి. అయితే మీ ఈపీఎఫ్ ఖాతాలో తగినంత సొమ్ము ఉన్నప్పుడే ఇదంతా సాధ్యం అని గుర్తుంచుకోవాలి. ఈపీఎఫ్వో నిబంధనలకు లోబడి మీ ఖాతాలో కనీసం రెండేండ్ల ప్రీమియంలకు సరిపడా నగదు ఉండాలి. ఇప్పటికే పలుమార్లు అడ్వాన్స్లు తీసుకున్నైట్లెతే ఖాతాలో నగదు నిల్వలు అంతంతమాత్రమే. దీంతో దరఖాస్తు వృథానే అవుతుంది. కరోనా దృష్ట్యా రెండోసారి కూడా అడ్వాన్స్ సౌకర్యాన్ని ఖాతాదారులకు ఈపీఎఫ్వో కల్పించినది తెలిసిందే. ఫలితంగా చాలామంది ఖాతాల్లో నగదు నిల్వలు తగ్గడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. కనుక తగిన ప్రణాళికతోనే ముందుకెళ్లాలి.