హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్రెడ్డి కుమారుడు అభిజిత్ (23) గుండెపోటుతో మరణించారు. ఆదివారం రాత్రి 2 గంటలకు అభిజిత్ నిద్రలో నుంచి కిందపడిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రశేఖర్రెడ్డి తన కుమారుడికి సీపీఆర్ చేసి, వెంటనే హైదర్గూడలోని అపోలో హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు ప్రయత్నించినా అభిజిత్ను కాపాడలేకపోయారు. కార్డియాక్ అరెస్ట్ వల్లే మరణించినట్టు ప్రకటించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభిజిత్కు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రూ.50లక్షల ప్యాకేజీతో దుబాయ్లో ఉద్యోగం వచ్చిం ది. వచ్చే నెల ఆయన దుబాయి వెళ్లాల్సి ఉన్నది. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం రాత్రి తామంతా కలిసి క్రికెట్ మ్యాచ్ చూశామని చెప్పారు. అభిజిత్ మరణం పట్ల వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు చంద్రశేఖర్రెడ్డిని పరామర్శించారు.