జీడిమెట్ల, నవంబర్ 29: మద్యం మత్తు….ఆపై సీసీ ఫుటేజీలకు కూడా అందని వేగం.. ఆ యువకుల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హెల్మెట్లు కూడా ధరించకపోవడంతో తలకు తీవ్ర గాయాలై… నూరేండ్లు నిండిపోయాయి. రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి..
జీడిమెట్ల ఇన్స్పెక్టర్ బాలరాజు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…గాజులరామారం విశ్వకర్మకాలనీకి చెందిన షేక్ మక్బూల్, మాలిన్ దంపతులు పూలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అబ్బాస్ (21) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. తనకు యమహా ఆర్-15 బైక్ కొనివ్వాలని కొద్ది రోజులుగా తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. ఇప్పుడే అవసరం లేదని చెప్పినా.. వినలేదు. మూడు రోజుల పాటు ఇంట్లో అన్నం తినడం మానేశాడు. దీంతో తల్లిదండ్రులు కొడుకు కోరికను కాదనలేక 15 రోజుల కిందట కొత్త వాహనాన్ని ఇప్పించారు. ఇక అబ్బాస్ స్నేహితుడు బహదూర్పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన సాయికిరణ్(25) ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. 11 నెలల కిందట వివాహం జరిగింది. అప్పటి నుంచి సాయికిరణ్ ఖాళీగా ఉంటున్నాడు.
ఈ నెల 24న సాయికిరణ్ అబ్బాస్తో కలిసి అతడి కొత్త బైక్పై తిరిగాడు. అదే రాత్రి 1:45 ప్రాంతంలో ద్విచక్రవాహనాన్ని నడిపిస్తున్న అబ్బాస్ షాపూర్నగర్ నుంచి ఐడీపీఎల్ చౌరస్తా వైపు అతివేగంతో వెళ్తూ.. చింతల్ బస్టాప్ సమీపంలోని ఆర్ఎన్సీ దవాఖాన వద్ద కారును ఓవర్ టెక్ చేసే సమయంలో అదుపు తప్పి.. డివైడర్ను ఢీకొట్టాడు. ఇద్దరు వాహనంపై నుంచి ఎగిరిపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలతో సాయికిరణ్ చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. ప్రమాదం జరిగిన రోజు అబ్బాస్, సాయికిరణ్ ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హెల్మెట్లు పెట్టుకోకుండా.. 100 కిలోమీటర్లకుపైగా వేగంతో వాహనాన్ని నడపడంతో నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు.