ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతున్న సమయంలో విపక్ష ఎమ్మెల్యేలు ఈడీ ఈడీ అంటూ అరిచారు. ఉద్ధవ్ వర్గంలోని శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఏక్నాథ్కు సపోర్ట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ విపక్షాలు నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వాన్ని మార్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ను బీజేపీ వాడుకున్నట్లు విపక్షాలు ఆరోపించాయి. అయితే విశ్వాస పరీక్షలో ఏక్నాథ్ నెగ్గిన తర్వాత మాజీ సీఎం ఫడ్నవీస్ అసెంబ్లీలో మాట్లాడారు. తమది ఈడీ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. ఈడీ అంటే ఏక్నాథ్ దేవేంద్ర ప్రభుత్వమని విపక్షాలకు తనదైన స్టయిల్లో కౌంటర్ ఇచ్చారు. బీజేపీ-శివసేన కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా.. తమ వద్ద మెజారిటీని విపక్షం లాక్కెళ్లినట్లు ఆరోపించారు. బీజేపీని కాదని కాంగ్రెస్, ఎన్సీపీతో ఉద్ధవ్ పొత్తు కట్టడాన్ని ఫడ్నవీస్ తప్పుపట్టారు.
ఏక్నాథ్ను కలుపుకని మరోసారి శివసేనతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, శివసైనికుడే సీఎం అయ్యారని ఫడ్నవీస్ అన్నారు. తమ పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాను డిప్యూటీ సీఎం అయినట్లు ఫడ్నవీస్ తెలిపారు. గతంలో తమ పార్టీ తనను సీఎంను చేసిందని, ఇప్పుడు ఇంటి వద్ద ఉండమన్నా ఉండేవాడినన్నారు.