పూజల్లో పాల్గొని తరించిన భక్తజనం
స్వామివారి ఖజానాకు రూ.13,45,991 ఆదాయం
యాదాద్రి, జనవరి 30 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం వైభవంగా జరిపించారు. కల్యాణోత్సవం, స్వామివారి నిత్యపూజల్లో భక్తులు పాల్గొని తరించారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతు నిర్వహించారు. బాలాలయ తిరువీధుల్లో స్వామి, అమ్మవార్లను గజ వాహనంపై ఊరేగించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకంతో అర్చించిన అర్చక బృందం.. శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించి ఆళ్వారులను కొలిచారు. ప్రతిష్ఠామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్యపూజలు వైభవంగా జరిగాయి. ఆలయంలో దర్శనం తక్కువ సమయంలో జరుపుకొనే అష్టోత్తర పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన చేశారు. సత్యనారాయణ వ్రతాల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. శ్రీవారి ఖజానాకు శనివారం రూ.13,45,991 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
స్వర్ణతాపడానికి రూ.28,55,492 విరాళాలు
యాదాద్రి, జనవరి 30 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి విమాన గోపురం స్వర్ణతాపడానికి జనవరి 22 నుంచి 29వ తేదీ వరకు రూ.28,55,492 విరాళం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత ఆదివారం తెలిపారు. ఇందులో చలాన్ ద్వారా నగదు రూ.7,67,519, ఆర్టీజీఎస్ నెఫ్ట్, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ ద్వారా రూ.3,47,961, చెక్కులు, డీడీల రూపంలో రూ.17,40,012 స్వామివారి ఖాతాలో జమ అయినట్లు వెల్లడించారు.
శ్రీవారి ఖజానా ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుకింగ్ ద్వారా 1,61,100
వీఐపీ దర్శనాలు 1,35,000
వేద ఆశీర్వచనం 1,800
సుప్రభాతం 300
ప్రచారశాఖ 5,600
క్యారీబ్యాగుల విక్రయం 9,900
వ్రత పూజలు 72,000
కల్యాణకట్ట టిక్కెట్లు 25,000
ప్రసాద విక్రయం 6,38,530
వాహన పూజలు 20,700
టోల్గేట్ 1,120
అన్నదాన విరాళం 24,091
సువర్ణ పుష్పార్చన 1,24,200
యాదరుషి నిలయం 64,250
పాతగుట్ట నుంచి 33,850
గోపూజ 200
ఇతర విభాగాలు 2,600