ఇచ్చోడ : యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం విరాళాలు ఇవ్వడానికి ముక్రా (కే) గ్రామ ప్రజలు ముందుకు వచ్చారు. బుధవారం గ్రామంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాశ్ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కుంకుమ బొట్టు పెడుతూ విరాళాలు సేకరిస్తూ నిధి జమా చేశారు. యాదాద్రి విమాన గోపురం కోసం గ్రామంలో మొత్తం రూ. 51 వేల నిధి జమ అయిందని సర్పంచ్ గాడ్గె మీనాక్షి తెలిపారు. మూడు రోజుల తరువాత జీపీ పాలక వర్గం ఆధ్వర్యంలో యాదాద్రికి వెళ్లి ఆలయ కమిటీ ఈవోకు రూ. 51 వేలను అందజేయనున్నామని ఆమె పేర్కొన్నారు.
చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్నదని, ఇందులో తమ గ్రామం సైతం భాగస్వామం కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. యాదాద్రి కోసం విరాళాలు ఇచ్చిన గ్రామస్తులందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వర్షతాయి, సంజీవ్, కైలాశ్, తిరుపతి మహిళలు తదితరులు పాల్గొన్నారు.ఇటీవల గ్రామాన్ని పచ్చదనంతో పాటు, హరితనిధికి తమ నెలవారి వేతనాన్ని సర్పంచ్, ఎంపీటీసీ , పంచాయతీ పాలకవర్గం ప్రకటించి ముక్రా గ్రామం ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే