యాదాద్రి, జనవరి18 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభమైన అధ్యయనోత్సవాలు మంగళవారం పరిపూర్ణమయ్యాయి. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అంతరంగికంగానే సేవలు చేపట్టారు. బాలాలయంలో నిత్యారాధనలు అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామిని దివ్య మనోహరంగా అలంకంరించి నమ్మాళ్వారు, రామానుజాళ్వారు, తిరుప్పన్ ఆళ్వారు, తిరుమంగై ఆళ్వారు, వనమావళైజీయర్ ఆళ్వారు ఉత్సవమూర్తుల ముందు దివ్య ప్రబంధ పారాయణాలను పఠించి, భక్తుల దర్శనార్థం బాలాలయంలో ఊరేగింపు సేవను నిర్వహించారు.
అనంతరం స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులకు తిరుమంజన, నవకలశ స్నపన మహోత్సవాన్ని ప్రధానార్చకులు నల్లంధీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు, వేద పండితులు పాంచరాత్రాగమ సంప్రదాయ రీతిలో వైభవంగా జరిపారు. రామానుజ సుత్తందారి ఉపదేశ రత్తినమాలై అనుసంధానం గావించి అధ్యయనోత్సవాలకు పరిసమాప్తి పలికారు. అనంతరం ఆధ్యయనోత్సవాలకు విచ్చేసిన దివ్యప్రబంధ పారాయణికులను ఆలయ అధికారులు ఘనంగా సన్మానించారు. ఉత్సవాల్లో ఆలయ అధికారులు శ్రవణ్కుమార్, గజవెల్లి రమేశ్బాబు పాల్గొన్నారు.
నరసింహస్వామి అలంకార విశిష్టత..
ఆధ్యయనోత్సవాల్లో భాగంగా చివరిరోజు స్వయంభూ పంచ నారసింహ క్షేత్రంలో శ్రీ నృసింహ అవతారంలో స్వామివారికి తీరువీధి సేవ నిర్వహించారు. నరసింహ అను శబ్ధమునకు యజ్ఞ నిర్వాహకుడు అని అర్థం. యజ్ఞములు అనగా లోకాలు, ప్రాణులు, వేదాలు, సమ స్త ప్రకృతి మండలం అని పురాణం చెబుతున్నదని ఆలయ అర్చకులు తెలిపారు. నృసింహస్వామి అంతర్ వ్యాప్తిగా ఉండి సమస్త ప్రాణకోటిని సంరక్షించే తీరును శంకర భగవత్ పాదులు వివరించారు.
స్వామివారి సేవలో మంత్రి ఎర్రబెల్లి..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దర్శించుకున్నారు. బాలాలయ ముఖ మండపంలో మంత్రి ఎర్రబెల్లికి ఆలయ ప్రధానార్చకులు, అర్చక బృందం వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జిల్లా నాయకులు కాంటేకార్ పవన్కుమార్ పాల్గొన్నారు.
నేటి నుంచి స్వామివారి నిత్య కల్యాణం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాల సందర్భంగా తాత్కాలికంగా నిలిపివేసిన సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం, శాశ్వత, మొక్కు కల్యాణం, బ్రహ్మోత్సవాలు నేటి నుంచి పునః ప్రారంభం కానున్నాయి.