యాదాద్రి, డిసెంబర్31 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో నూతన సంవత్సర వేడుకలకు ఆలయ అర్చకులు ముస్తాబు చేశారు. హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వీఐపీలు, భక్తులు అధిక సంఖ్యలో రానుండడంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తెరిచి స్వామివారి దర్శనం కల్పించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉభయ దర్శనాలు(వీఐపీ, ధర్మ దర్శనాలు), 1.30 నుంచి రాత్రి 9 గంటల వరకు సాధారణ దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు.
యాదాద్రి కొండపైన స్వామివారి ఆలయం, పాతగుట్టలోని ఆలయాన్ని మామిడి తోరణాలు, అరటిమట్టలతో ఆలంకరించారు. కొండకింద చెక్పోస్టు నుంచి కొండపై వరకు ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటును నిషేధించారు. భక్తుల రద్దీ దృష్ట్యా 31న రాత్రి నుంచి కొండపైకి వాహనాలు అనుమతించరు. ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రసాద కౌంటర్లు తెరిచి ఉంటాయి. 100 గ్రాముల లడ్డూలు, అభిషేకం లడ్డూలను 60 వేల వరకు అందుబాటులో ఉంచారు. భక్తులకు సరిపడా పులిహోర ప్రసాదాన్ని సిద్ధం చేశారు. కల్యాణకట్టను ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు.
ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం
యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. భక్తులు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. నిత్యకల్యాణోత్సవంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయానికి శుక్రవారం రూ. 9,72,901 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.