యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కపట నాటకమాడుతూ కర్షకుల బతుకుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వంపై గులాబీ సేన గళమెత్తింది. రెండు నాల్కల బీజేపీ నేతల వైఖరిని నిలదీస్తూ అన్నదాతకు దన్నుగా కదం తొక్కింది. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద రాష్ట్ర సర్కారు నిర్వహించిన మహాధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్లారు. తమకు అండగా.. ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు ముందువరుసలో నిలువడంతో రైతులు స్వచ్ఛందంగా కదిలివెళ్లారు. యాసంగి ధాన్యం కొంటరా, కొనరా? తేల్చండంటూ నిలదీశారు. జిల్లా నుంచి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల, డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డితోపాటు అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు ధర్నాలో భాగస్వాములయ్యారు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ ధర్నాకు పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛందంగా రైతాంగంతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. జిల్లా నుంచి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డితోపాటు పలువురు జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు గురువారం ఉదయమే బయల్దేరి వెళ్లారు. వీరికి సంఘీభావంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివెళ్లారు. మేము సైతం అంటూ రైతులు కూడా పట్నం బాట పట్టారు. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన మహాధర్నాతోపాటు హైదరాబాద్లో గురువారం నిర్వహించిన ధర్నాలోనూ రైతులు స్వచ్ఛందంగా పాల్గొని టీఆర్ఎస్ వెన్నంటే ఉంటామని మరోసారి పోరాట స్ఫూర్తిని చాటారు.
ధర్నాకు ఉత్సాహంగా..
రైతుల కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధానికి జిల్లా నుంచి టీఆర్ఎస్ దండు సిద్ధమైంది. ఎమ్మెల్యేలకు మద్దతుగా పార్టీ శ్రేణులు, రైతులు ఇందిరాపార్క్కు తరలివెళ్లి కేంద్రంపై కొట్లాడేందుకు ఎందాకైనా సిద్ధమని తేల్చిచెప్పారు. ముఖ్య నాయకులతోపాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉత్సాహంగా వెళ్లారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చేపట్టిన ఈ ధర్నాలో సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొనడం పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. జిల్లాలో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లోని ప్రతి మండలం నుంచి అన్ని స్థాయిల్లో పార్టీ శ్రేణులు ధర్నాలో పాల్గొని ఉద్యమ స్ఫూర్తిని చాటారు. జిల్లాలోని ఆయా మండలాల నాయకులు, రైతులు తరలివెళ్లి కేంద్రంపై తమ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్ వెళ్లారు.
రైతులకు అండగా నిలువడంపై సర్వత్రా హర్షం
రైతులకు టీఆర్ఎస్ పార్టీ అండగా నిలువడం పట్ల రైతాంగంతోపాటు ఇతర వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెట్టి రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం అన్నదాతల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. దానిని కేంద్రం అడ్డుకునే విధంగా చేస్తున్న ప్రయత్నాల పట్ల యావత్ ప్రజానీకం విమర్శిస్తున్నది. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నెల 12న మహాధర్నా నిర్వహించగా రైతులు కదంతొక్కి సక్సెస్ చేశారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ధర్నాకు సైతం రైతులు స్వచ్ఛందంగా వెళ్లి టీఆర్ఎస్ పోరాటానికి సంపూర్ణ మద్దతు పలికారు.
ప్రతి గింజనూ కొనాలే…
వానకాలం వరి పంటతోపాటు రాబోయే యాసంగి ధాన్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ ధర్నా కొనసాగుతుంది. రైతాంగమంతా కేసీఆర్ ఉంటే ఉన్నారు. మా కోసం ధర్నా చేస్తున్న కేసీఆర్కు అండగా ఉంటామని రైతాంగమంతా ధర్నా చౌక్ వద్దకు చేరుకుంది. రైతులతో హైదరాబాద్ అంతా దిగ్బంధంలోకి వెళ్లింది. వడ్ల కొనుగోలుపై రైతాంగానికి స్పష్టమైన హామీ ఇవ్వకుండా బండి సంజయ్ దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా మేం ముందుంటాం
తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. ఇక ముందు కూడా కేంద్రంపై పోరాటంలో ఏ పిలుపునిచ్చినా అగ్రభాగాన ఉంటాం. రెండ్రోజులపాటు రాష్ట్ర రైతాంగం తరఫున నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రైతాంగం బీజేపీ నేతకు చుక్కలు చూపి పోరాట వారసత్వాన్ని మరోసారి చాటారు. ఒకనాడు నీళ్లు, కరెంటు లేక ఎడారిగా ఉన్న ఉమ్మడి నల్లగొండలో నేడు 20 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వరాష్ట్రంలో రైతులు బాగపడుతుంటే ఓర్వలేక క్షుద్ర రాజకీయాలకు
తెరలేపారు. అందుకే ఇలాంటి ధర్నాలు చేయాల్సి వస్తున్నది. కేసీఆర్తో గోక్కోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమే. రాష్ట్ర రైతాంగం కోసం చేసే పోరాటం దేశ రైతాంగానికే దిక్సూచిగా
నిలుస్తుంది.
-మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి