ఆలేరు టౌన్, నవంబర్ 10 : మాతా, శిశు సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. పోషణ్ అభియాన్ కార్యక్రమం కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించింది. నిర్వహణలో లోపాలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. జిల్లాలో ప్రతి అంగన్వాడీ సెంటర్కు త్వరలో స్మార్ట్ఫోన్ అందించనున్నారు. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు ఐసీడీఎస్ ప్రాజెక్టులకు అందించారు. క్షేత్ర స్థాయిలో పథకాల అమలుపై పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా పోషణ్ ట్రాకర్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పటికే ట్యాబ్ల్లో, వారి సొంత ఫోన్లలో వివరాలు నమోదు చేస్తున్నారు. యాప్ వినియోగం, సమాచారం నమోదుపై గతంలో వారికి శిక్షణ ఇచ్చారు. మరోసారి శాఖ తరపున సెల్ఫోన్లు అందించాక వారికి శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద 901 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వీటిల్లో గర్భిణులు 5954, బాలింతలు 6049, చిన్నారులు 21,700 మంది ఉన్నారు.
మరింత పారదర్శకంగా సేవలు
అంగన్వాడీ సేవలు మరింత పారదర్శకంగా అందనున్నాయి. పోషణ్ ట్రాకర్లో బాలింతలు, గర్భిణుల వివరాలు నమోదు చేస్తారు. 0-6 నెలలు, 6-3ఏండ్లు, 3-6ఏండ్ల లోపు చిన్నారుల వివరాలు నమోదు చేస్తున్నారు. కిశోర బాలికల వివరాలు సైతం నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా 1,2,3 తేదీల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఎత్తు, బరువు చూసి ఆ వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. దీంతో పాటుగా 3నెలలకు ఒకసారి ఎదుగుదల తీరును నమోదు చేస్తారు. తద్వారా చిన్నారుల ఎదుగుదలలో ఏమైనా తేడా ఉంటే గుర్తించేందుకు వీలుంటుంది. ప్రతిరోజూ ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన వెంటనే పోషణ్ ట్రాకర్ యాప్లో లాగిన్ అయ్యాక అంగన్వాడీ కేంద్రానికి ఎంత మంది చిన్నారులు హాజరయ్యారో ఫొటో తీసి వివరాలు నమో దు చేయాలి. అలాగే చిన్నారులకు మధ్యాహ్నం సమయంలో పౌష్టికాహారం అందించే సమయం, గర్భిణులు, బాలింతలకు పోష్టికాహారం అందించే సమయంలో ఫొటోలు తీయడంతో పాటు ఎంతమందికి పోషకాహారం, గుడ్లు అందించిన వివరాలు యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. వారంలో ఎంత మందికి టీకాలు వేశారో, నవజాత శిశువుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. పోషణ్ ట్రాకర్ యాప్ అందుబాటులోకొచ్చాక ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంది. ప్రభుత్వం అందించే స్మార్ట్ఫోన్లో అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం అంగన్వాడీ కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు సమాచారం చేరుకుంటుంది.
ప్రతినెలా ప్రోత్సాహకం
మాతా శిశు సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక నుంచి ప్రతినెలా చిన్నారుల ఎత్తు, బరువు వివరాలు సేకరించనుంది. ఇందుకోసం అంగన్వాడీ కేంద్రాల సిబ్బందికి నిర్ణీత లక్ష్యాలు నిర్ణయించి ప్రోత్సాహకాలు అందించనుంది. పోషణ్ అభియాన్ కింద నిర్దేశించిన కొత్త లక్ష్యాలు, విధివిధానాలు ఈ నెల నుంచి అమల్లోకి వచ్చేలా కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. లక్ష్యం మేరకు వివరాలు తీసుకొని యాప్లో నమోదు చేసిన అంగన్వాడీ టీచర్కు నెలకు రూ.500, ఆయాకు రూ.250 ప్రోత్సాహకం అందించనుంది. కరోనా కారణంగా గతంలో వివరాలు నమోదు చేయడం సాధ్యం కాలేదు. కేసులు తగ్గడంతో కేంద్రం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. ప్రతినెలా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను తీసుకొని ఆరోగ్య పరిస్థితిని పోషణ్ ట్రాకర్ యాప్లో నమోదు చేయాలని సూచించింది. అంతే కాకుండా అంగన్వాడీ కేంద్రాలు 21రోజులు తప్పనిసరిగా తెరవాలని సూచించింది. అన్ని వివరాలను యాప్లో నమోదు చేసినప్పుడే నిర్ణీత లక్ష్యం సాధించినట్లు యాప్ గుర్తిస్తుంది. వారికి ప్రోత్సాహకాలు అందిస్తారు.
స్మార్ట్ఫోన్లు త్వరలో పంపిణీ
అంగన్వాడీ టీచర్లకు త్వరలో స్మార్ట్ఫోన్లు అందించి శిక్షణ ఇస్తాం. జిల్లాకేంద్రానికి చెందిన స్మార్ట్ఫోన్లను ప్రాజెక్టులకు పంపించాం. ప్రతి కేంద్రానికీ ఒకటి చొప్పున అందజేస్తాం. స్మార్ట్ఫోన్తో సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోషణ్ ట్రాకర్ యాప్లో నమోదు చేస్తారు. తద్వారా మెరుగైన సేవలు అందుతాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యకర జీవితానికి బాటలు వేస్తున్నాం.