వృత్తిదారుల జీవన స్థితిగతులను మెరుగుపర్చే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నరాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా కల్లుగీత కార్మికులకు మరొక శుభవార్త వినిపించింది.నీరా ప్లాంట్లను నెలకొల్పి ఆర్థిక చేయూతను అందించేందుకు నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టుగా భువనగిరి మండలంలోని నందనం గ్రామాన్ని ఎంపికచేసి నీరా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. అందుకోసం తాజాగా రూ.8కోట్ల నిధులను సైతం మంజూరు చేసింది. హైదరాబాద్లో ఇప్పటికే నీరా పార్లర్ను ఏర్పాటుచేసి విక్రయాలు చేపడుతుండగా, నందనం పైలెట్ ప్రాజెక్టుతో వచ్చే సత్ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఏండ్లనాటి నిరీక్షణ ఫలిస్తుండడంతో ఉమ్మడి జిల్లా గీత కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కుల వృత్తులను ప్రోత్సహించి గ్రామాల స్వయం సమృద్ధికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్.. గౌడ కులస్తులు ఆత్మగౌరవంతో బతికేలా నీరా పాలసీని అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దశలవారీగా అన్ని జిల్లాల్లో నీరా ఉత్పత్తి, సరఫరాను విస్తరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికల రూపకల్పన చేస్తున్నది. పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేశాక ఫలితాలను బట్టి అన్ని జిల్లాల్లోనూ విస్తరించేందుకు ఆబ్కారీశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే గీత కార్మికులు అధికంగా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని ‘నందనం’ గ్రామాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇంతకుమందు ఇక్కడ ఏర్పాటైన తాటి ఉత్పత్తుల కేంద్రం వద్దనే నీరా శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. మూతబడ్డ ఈ కేంద్రాన్ని నవీకరించి నీరాగా ప్రాసెస్ చేయడానికి అవసరపడే ఆధునిక యంత్రాలతో ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. నిల్వ చేసేందుకుగాను కోల్డ్ స్టోరేజీ యూనిట్లతోపాటు ఇతర తాటి ఉత్పత్తుల తయారీకి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంటు, నాలుగు నీరా సేకరణ కేంద్రాల కోసం బీసీ సంక్షేమ శాఖకు ప్రభుత్వం రూ.8కోట్లను మంజూరు చేసింది. ఇక్కడి ప్లాంటులో ఉత్పత్తి చేసిన నీరా, తాటి ఉత్పత్తులను హైదరాబాద్లోని నీరా పార్లర్లలో విక్రయించనున్నారు.
ఔషధ గుణాల నీరా..
ఔషధ గుణాలు కలిగిన నీరాకు దేశ, విదేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. తాటి, ఈత చెట్లతోపాటు ఖర్జూర చెట్ల నుంచి కూడా నీరాను తయారు చేస్తారు. అయితే, తెలంగాణలో ఈత, తాటి చెట్లు మాత్రమే ఎక్కువగా ఉండడంతో వీటితోనే నీరా తయారు చేస్తున్నారు. సూర్యకాంతి పడితే కల్లుగా మారనుండడంతో తెల్లవారుజామున నాలుగున్నర నుంచే నీరాను సేకరిస్తారు. దీన్ని రెండు, మూడు గంటల్లోనే సేవించాల్సి ఉంటుంది. ఐస్ బాక్సుల్లోగానీ, ఫ్రిజ్లో గానీ ఉంచితే రంగు, రుచి మారకుండా ఉంటుంది. శుద్ధి చేసిన నీరాను బాటిళ్లలో నింపి శీతలీకరణ చేస్తే మూడు నుంచి ఆరు నెలల వరకు నిల్వ చేయవచ్చు. కొబ్బరి నీళ్లకంటే శ్రేష్టంగా ఉండే నీరు మత్తు ఇవ్వకపోగా.. ఆరోగ్య ప్రదాయినిగా అందరూ సేవించవచ్చు. కిడ్నీల్లో రాళ్లు తొలగిపోతాయని, క్యాన్సర్, నరాల బలహీనత, మధుమేహం వంటి వ్యాధులకు ఉత్తమ ఔషధమనే ప్రచారం కూడా వాడుకలో ఉంది. ఇన్ని గుణాలున్న నీరాను ఇప్పటికే అమెరికా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, కాంబోడియా, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. యాదాద్రి జిల్లాలో 324 వరకు కల్లు సొసైటీలు ఉండగా..అందులో 13 వేలకు పైగా సభ్యులు ఉన్నారు. వీరిలో 70శాతానికి పైగా సభ్యులు గీత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా ఈత, తాటి చెట్లు ఉండగా.. ఇందులో తాటిచెట్లే అధికం. కల్లు గిరాకీ లేకపోవడంతో గీతకార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నీరా ప్లాంటు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న సంతోషంలో ఈ ప్రాంత గీత కార్మికులు ఉన్నారు.
నా కృషి ఫలించింది…
నందనంలో నీరా ప్లాంటు ఏర్పాటు కోసం ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో కృషి చేశా. గీత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నీరా ప్లాంటు గీత కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుంది. ప్లాంటు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్కు, మంత్రి శ్రీనివాస్గౌడ్కు కృతజ్ఞతలు.
-బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ
ఫలించిన ఏండ్లనాటి నిరీక్షణ…
ఉమ్మడి రాష్ట్రంలో 1993 సంవత్సరంలో గీత పారిశ్రామిక సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.70లక్షల అంచనా వ్యయంతో నందనం వద్ద తాటి ఉత్పత్తుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తాటి కల్లుతో బెల్లం, చాక్లెట్ల వంటి తిను బండారాలను, తాటి ఆకులతో విసన కర్రలు, తాటి జెగ్గలతో బొమ్మలు, ఆట వస్తువులను, తాటి ముంజలతో నీరా, దాని నుంచి ఆయుర్వేద మందులను తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ ద్వారా గీత కార్మికులు, వారి కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సి ఉండగా మూడు నెలలకే ఈ కేంద్రం మూతపడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇదే ప్రాంతంలో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరుగునపడిన ఈ కేంద్రానికి పునరుజ్జీవం కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వ చర్యలతో ఈ ప్రాంత గీత కార్మిక కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నీరా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులేవీ అందలేదని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి యాదయ్య ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఎంతోకాలంగా ఈ ప్రతిపాదన ఉన్నదని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కార్యాచరణ మొదలుపెడతామని పేర్కొన్నారు.