భువనగిరి అర్బన్, సెప్టెంబర్ 1: కొవిడ్ కారణంగా గత 16 నెలల నుంచి మూతబడిన విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, డిగ్రీ, జూనియర్ కళాశాలలు బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది పాఠశాలల్లో శానిటైజేషన్ చేశారు. ఎలాంటి పిచ్చి మొక్కలు లేకుండా తొలగించి పారిశుధ్య కార్యాక్రమాలు చేపట్టారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పాఠ్యపుస్తకాలను సరఫరా చేశారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తొరణాలు ఏర్పాటు చేసి పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 833 పాఠశాలలు ఉండగా ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 676, ప్రైవేట్ పాఠశాలలు 157 ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలు 844, మినీ అంగన్వాడీలు 57 మొత్తం కలిపి 901 కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 833 పాఠశాలలు తెరచుకున్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 676 ఉండగా ఈ పాఠశాలల్లో మొత్తం 38893 మంది విద్యార్థులకు మొదటి రోజు 13127 మంది హాజరుకాగా 33.7శాతం ఉంది. ప్రైవేట్ పాఠశాలలు 157 ఉండగా ఇందులో 46854 మంది విద్యార్థులున్నారు. మొదటి రోజు 11713 మంది హాజరుకాగా 25శాతం ఉన్నారు. మొత్తం 833 పాఠశాలలకుగానూ 85747 మంది విద్యార్థులకు 24840 మంది హాజరై 28 శాతం నమోదైంది. జిల్లాలో ఉన్న 901 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించారు. అదే విధంగా జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 11 ఉండగా అందులో ప్రథమ సంవత్సరంలో 2476 మంది విద్యార్థులకు గాను 650 మంది హాజరుకాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2639లకు గానూ 575 మంది హాజరై 23.9 శాతం నమోదయ్యారు. జిల్లాలో ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 29 ఉండగా అందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1490 మందికి 327, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 3499 మందికి 699 మంది హాజరుకాగా 20.5శాతం నమోదైంది. అదే విధంగా జిల్లాలో 19 డిగ్రీ కళాశాలలు ఉన్నారు. ఆలేరు, రామన్నపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా భువనగిరిలో ఎయిడెడ్ డిగ్రీ కళాశాల లు, 16 ప్రైవేట్ డిగ్రీ కళాశాలు ఉన్నాయి. మొద టి రోజు అన్ని కళాశాలలు ప్రారంభమయ్యాయి.
భువనగిరి అర్భన్: మండలంలోని కూనూరులోని జిల్లా ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి యాదవ్ పరిశీలించారు. భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు పరిశీలించారు. విద్యార్థులకు థర్మల్స్క్రీనింగ్ చేశారు.
యాదగిరిగుట్టరూరల్: మండలంలోని వంగపల్లి ప్రాథమిక పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ తొటకూరి అనురాధ, ఎంపీడీవో కారం ప్రభాకర్రెడ్డి చప్పట్లు కొడుతూ తరగతి గదులకు ఆహ్వానించారు.
తుర్కపల్లి: మండల కేంద్రంతో పాటు ముల్కలపల్లి, మాదాపురం పాఠశాలలను ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్, ఎంపీడీవో ఉమాదేవి సందర్శించారు. విద్యార్థులు భౌతికదూరంతో పాటు కొవిడ్ నిబంధనలు పాటించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బొమ్మలరామారం: మండలంలోని గద్దరాళ్లతండా పాఠశాలను ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి సందర్శించి తనిఖీ చేశారు.
యాదాద్రి: యాదగిరిగుట్ట పట్టణంలో గోశాల బాలుర,బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 229 విద్యార్థులకు 33 మంది, యాదగిరిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 168 మందికి 29 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇన్చార్జి ఎంఈ వో జె. కృష్ణ తెలిపారు.
భువనగిరి అర్బన్, సెప్టంబర్ 1: పాఠశాలలు ప్రారంభించిన నేపథ్యంలో కొవిడ్ నిబంధనల మేరకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలి. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రోజూ థర్మల్స్క్రీనింగ్ చేసి అనారోగ్యంగా ఉంటే వెంటనే సమాచారం అందించాలి. తరగతి గదులు, పాఠశాలల్లో భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, పాఠశాల ఆవరణలో శానిటైజేషన్ చేయాలి. ఇలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తే పాఠశాలకు కచ్చితంగా పంపుతాం.
-బి.వెంకటస్వామి, విద్యార్థిని తండ్రి
ప్రభుత్వం కరోనా వైరస్ ప్రభావంతో పాఠశాలలను మూసివేసి ఆన్లైన్ ద్వారా విద్యను అందించారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొన్న ప్రభుత్వం నేడు పాఠశాలలను పునఃప్రారంభించడం హర్షణీయం. ప్రతి విద్యార్థి తల్లిదంద్రులు తమ పిల్లలకు కరోనా వైరస్పై అవగాహన కల్పించాలి. పాఠశాలకు హాజరయ్యే విద్యార్థులు భౌతికదూరం పాటించేవిధంగా చర్యలు తీసుకోవాలి.
-పెండెం శ్రీనాథ్, ఆత్మకూర్(ఎం)
గుండాల, సెప్టెంబర్ 1 : కరోనా నేపథ్యంలో మూతబడిన విద్యాసంస్థలను పునఃప్రారంభించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనల మేరకు విద్యాబోధన కొనసాగించాలి. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం.ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయం.
-ఎండీ.ఉస్మాన్ఖాన్,టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు