‘తండ్రిగా శివానీనిచూసి గర్వపడుతున్నా. నటనలో నా పేరును నిలబెట్టిందని అందరూ ప్రశంసిస్తుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు హీరో రాజశేఖర్. ఆయన తనయ శివానీ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’. కె.వి. గుహన్ దర్శకుడు. రవిప్రసాద్రాజు దాట్ల నిర్మించారు. అదిత్ అరుణ్ హీరోగా నటించారు. ఈ నెల 24న ‘సోని లివ్’ ఓటీటీ ద్వారా విడుదలకానుంది. శనివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ‘స్వతహాగా ఇంజినీర్ అయిన రవిప్రసాద్రాజు సినిమాల పట్ల మక్కువతో నిర్మాతగా మారారు.
కొత్తదనాన్ని నమ్మి ఆయన చేసిన ఈ ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. జీవితారాజశేఖర్ మాట్లాడుతూ ‘సినిమాల్లో నటించాలనే మా అమ్మాయిల కోరికను మేమెప్పుడూ కాదనలేదు. సక్సెస్ కాకపోతే నిరుత్సాహపడకుండా వేరే రంగాన్ని ఎంచుకోమని సూచించాం. కానీ ఆ అవసరం రాదని తమ నటనతో నిరూపిస్తున్నారు’ అని తెలిపారు ‘తక్కువ మంది నటీనటులతో ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాం’ అని దర్శకుడు గుహన్ అన్నారు. కంప్యూటర్స్ స్క్రీన్స్ ప్రధానంగా సాగే థ్రిల్లర్ చిత్రమిదని అదిత్ అరుణ్ తెలిపారు. కథానాయికగా తనను ఈ సినిమా కొత్తగా ఆవిష్కరిస్తుందని శివానీ చెప్పింది. ఈ కార్యక్రమంలో సైమన్కింగ్, మిర్చి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.