సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 ( నమస్తే తెలంగాణ ) : తెలుగురాష్ట్రాల్లోని ఐటీ, పరిశ్రమల రంగాలకు విదేశాల్లోని అవకాశాలను చేరువ చేసే క్రమంలో వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(WTITC) ఈనెల 18న ఆఫ్రికా(Africa)లో సమ్మిట్ నిర్వహించనుంది. ఈ మేరకు సమ్మిట్ లోగోను ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు(ridhar babu) గురువారం పార్క్హయత్ హోటల్లో ఆవిష్కరించారు.
దక్షిణాఫ్రికాలోని జోహనెస్బర్గ్లో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్టు డబ్ల్యూటీఐటీసీ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాలా తెలిపారు. టెక్నాలజీ ఎక్స్ఛేంజ్తో పాటు వ్యాపార విస్తరణకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని వివరించారు. అంతేకాదు ఇథియెపియా, లెసెథో, కింగ్డాం, కెన్యా, జింబాబ్వే తదితర దేశాల్లో డబ్ల్యూటీఐటీసీ బృందం పర్యటించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్ కృష్ణ, నివ్య, శ్రీధర్ గోనెపల్లి, రవితేజ గుప్తా తదితరులు పాల్గొన్నారు.