హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 13: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్వయంప్రతిపత్తి(కేడీసీ) బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ హీమోగ్లోబిన్ అవగాహన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మానవ శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు హీమోగ్లోబిన్ ఎంత కీలకమో వివరిస్తూ, రక్తహీనతను నివారించడం ద్వారానే చురుకైన విద్యార్థి దశ సాధ్యమని పేర్కొన్నారు. బయోటెక్నాలజీ విభాగాధిపతి కిషోర్కుమార్ మాట్లాడుతూ ఐరన్ (ఇనుము) లోపాన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన ఆహార నియమాలపై అవగాహన కల్పించారు.
ముదురు ఆకుపచ్చ కూరగాయలు, ఎండు ఖర్జూరం, బీట్రూట్ వంటి పోషక విలువలున్న ఆహారం ద్వారా రక్తాన్ని వృద్ధి చేసుకోవచ్చని సూచించారు. అనంతరం రఘు మాట్లాడుతూ హీమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వలన కలిగే తీవ్రమైన అలసట, ఏకాగ్రత లోపించడం వంటి దుష్ర్పభావాలను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రజనీలత, కోమల్, సమ్మయ్య, దినేష్, సమత, శ్యామ్, యుగేందర్, మహేందర్, సీతారాములు పాల్గొన్నారు.