మెల్బోర్న్: ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా మహిళల జట్టుకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆసీస్ మహిళల టీమ్ డిసెంబర్లో భారత్లో పర్యటించనుంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సోమవారం పర్యటన వివరాలు వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలో వన్డే ప్రపంచకప్ ఆడిన భారత మహిళల జట్టు.. జూలైలో బర్మింగ్హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొననుంది.
ఆ తర్వాత సెప్టెంబర్లో ఇంగ్లండ్తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ‘కొత్త సీజన్ ఆరంభం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. ఇందులో భాగంగా సొంతగడ్డపై పాకిస్థాన్తో సిరీస్తో పాటు.. ఈ ఏడాది ఆఖర్లో భారత్లో పర్యటించనున్నాం’ అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లీ తెలిపాడు.