న్యూఢిల్లీ : నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారన్న ఎస్బీఐ ( State Bank Of India ) ఆదేశాలపై ఢిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఎస్బీఐకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. గర్భిణి మహిళలను అన్ఫిట్ అని పేర్కొనడం.. వారి పట్ల వివక్ష చూపడమేనని, ఇది చట్టవిరుద్ధమని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గర్భిణి మహిళల పట్ల ఉద్యోగ నియామక మార్గదర్శకాలు ఎలా రూపొందించారో వివరణ ఇవ్వాలన్నారు. అయితే ఈ నోటీసులపై ఎస్బీఐ ఇంకా స్పందించలేదు. తమ నోటీసులకు మంగళవారం లోగా సమాధానం ఇవ్వాలని ఎస్బీఐని ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించింది.
నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారని, వారు బిడ్డను ప్రసవించాక 4 నెలల్లోపు ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనలపై సమాజంలోని భిన్నవర్గాలతో పాటు ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ అసోసియేషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.