కొత్తూరు, జూలై 18: ‘డంపింగ్ యార్డు హఠావో.. జేపీ దర్గా బచావో’ అంటూ శనివారం గ్రామ మహిళలు, యువత సహా మైనారిటీలు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని డిమాండ్ చేస్తూ డంపింగ్ యార్డు వ్యతిరేక జేఏసీ ఇచ్చిన ‘చలో కలెక్టరేట్’కు పెద్దఎత్తున తరలివెళ్లారు. డీసీపీ శిరీష ఆధ్వర్యంలో పోలీసులు నిరసనకారులను ఎక్కడికక్కడే అడ్డుకొన్నారు. డంపింగ్ యార్డుతో ప్రతిష్ఠాత్మక జేపీ దర్గాకు పెనుముప్పు పొంచి ఉన్నదని జేపీ దర్గా నుంచి ప్రజలు కలెక్టరేట్కు వెళ్లేందుకు సిద్ధంకాగానే, వారిని పోలీసులు ముందుకు కదలనీయలేదు.
సీఎం రేవంత్రెడ్డి డౌన్డౌన్, ఎమ్మెల్యే శంకర్ డౌన్డౌన్ అంటూ నినదిస్తూ ముందుకుసాగారు. పోలీసుల నిర్బంధాన్ని దాటుకొని జేపీ దర్గా నుంచి ఇన్ముల్నర్వ గ్రామాన్ని నిరసనకారులు దాటారు. ఈ సమయంలో డీసీపీ శిరీష మాట్లాడుతూ సోమవారం కలెక్టర్ను కలిసేందుకు అనుమతిచ్చారని, ముఖ్య నాయకులు కొందరు వెళ్లి వినతిపత్రం ఇవ్వాలని సూచించారు. దీంతో దీంతో నిరసనకారులు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విరమించుకున్నారు.
కొందరు పోలీస్ నిర్బంధాన్ని దాటుకొని వెళ్లగా జేపీ దర్గా వద్ద వారిని పోలీసులు అడ్డుకొన్నారు. చలో కలెక్టరేట్ నేపథ్యంలో జేఏసీ ముఖ్యనాయకులు శేఖర్రెడ్డి, జగన్, దేవేందర్, సురేందర్, నవీన్చారిని పోలీసులు శనివారం తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా శేఖర్రెడ్డి మాట్లాడుతూ జీవో 641 ఉపసంహరించుకొనే వరకు ఉద్యమం ఆగదని, తమ ప్రాంతాన్ని రక్షించుకొనేందుకు ఎంతవరకైనా ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు.