వరుస లాక్డౌన్ల ప్రభావంతో మగ్గాల సడుగులు ఇరిగినంత పనైంది. ఈ పరిస్థితిలో నేతన్నలను ఆదుకోవాలని సంకల్పించారు మధ్యప్రదేశ్కు చెందిన నలుగురు అతివలు. గాంధీజీ ఆశయాలతో ముందుకొచ్చి ఖాదీ, చేనేత వస్ర్తాల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. చేనేతకు వెన్నుదన్నుగా నిలవాలనుకుంటున్న 50 మంది మహిళలను తమ జట్టులో చేర్చుకున్నారు. రంగురంగుల చేనేత చీరలు ధరించి భోపాల్లోని కమలాపార్క్ నుంచి నగరంలోని గౌహర్ మహల్ వరకు ‘ఖాదీ వాక్’ నిర్వహించారు. ‘మొదటి లాక్డౌన్ సమయంలో చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు నేను, నా స్నేహితురాళ్లు చాలా చీరలు కొన్నాం. రెండో లాక్డౌన్లో ఖాదీ, చేనేత వస్ర్తాల గురించి ప్రజలకు తెలియజెప్పాలని అనుకున్నాం. మనం ప్రోత్సహిస్తేనే ఆ కళాకారుల కుటుంబాలు వేరే ఉపాధిని వెతుక్కునే ప్రయత్నాలను చేయవని అనిపించింది. అందుకే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం’ అని చెబుతున్నారు నలుగురి మహిళల్లో ఒకరైన అనుపమ శర్మ.