హైదరాబాద్ : సరూర్నగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ మహిళను గురువారం మధ్యాహ్నం హోంగార్డు ఈశ్వరయ్య కాపాడారు. నాగోల్కు చెందిన మహిళ (30) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుటుంబ సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సరూర్నగర్ లేక్ వద్దకు చేరుకొని అందులో దూకింది. అయితే, ఆత్మహత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సరూర్నగర్ పోలీసులకు సమాచారం అందించారు.
ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న హోంగార్డు ఈశ్వరయ్య వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకొని నీటిలో మునుగుతున్న మహిళను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. సదరు మహిళకు ప్రాథమిక చికిత్స చేసి అనంతరం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆమె పరిస్థితి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన ఈశ్వరయ్యను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అభినందించారు. గత ఆరు నెలల కాలంలో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన 12 మందిని ఈశ్వరయ్య కాపాడారని అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పెండ్యాల గ్రామానికి చెందిన ఈశ్వరయ్య.. విధులను నిబద్ధతో, నిజాయితీగా పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలను పొందాడు. ఎక్కడ విధులు నిర్వహించినా పేదవారు, ఆకలితో అలమటించే వారు ఎవరైనా సరే.. వారికి భోజనం, అల్ఫాహారం, ఇతర తినుబండరాలను అందించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించినవారిని కాపాడారు. ఈ సేవలను గుర్తించి ఉన్నతాధికారులు ఆయనను ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ అవార్డు కోసం సిఫారసు చేశారు.