పుంజుకుని సత్తా చాటితే ముందడుగు..లేకపోతే వెనుకడుగు.. అనేలా పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ శనివారం కోల్కతా నైట్రైడర్స్తో చావోరేవో తేల్చుకోనుంది.
పుణె: ఐపీఎల్-15వ సీజన్ను రెండు ఓటములతో ప్రారంభించిన విలియమ్సన్ సేన అనంతరం వరుసగా ఐదు మ్యాచ్లు నెగ్గి ఫుల్ జోష్లో కనిపించింది. తదనంతరం అనూహ్యంగా నాలుగు మ్యాచ్లు చేజార్చుకుని ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పుణె వేదికగా శనివారం కోల్కతా నైట్రైడర్స్తో జరుగనున్న మ్యాచ్లో హైదరాబాద్ తప్పక గెలువాల్సిందే. పరాజయాల నుంచి కోలుకుని సమిష్టిగా రాణించి సన్రైజర్స్ గెలిస్తే నాకౌట్ అవకాశాలు మరింత మెరుగవుతాయి.
లేదంటే ప్లేఆఫ్స్ రేసు నుంచి వెనుదిరుగాల్సి వస్తుంది. పదకొండు మ్యాచ్లాడి ఐదింట నెగ్గి పది పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్న హైదరాబాద్ జూలు విదిల్చాల్సిందే. 12 మ్యాచ్ల్లో ఐదింటిని గెలిచి పాయింట్లపరంగా సమానంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ బృందంపై పరాక్రమం చూపించాల్సిన అవసరం ఉంది. కోల్కతాను ఓడిస్తే ఇక ఆరెంజ్ ఆర్మీకి తిరుగుండదు. గాయాలతో దూరమైన వాషింగ్టన్ సుందర్, నటరాజన్ శనివారం మ్యాచ్కు అందుబాటులోకి వస్తారని ప్రధాన కోచ్ టామ్ మూడీ తెలుపడం హైదరాబాద్కు కలిసి రానుంది.
పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఫామ్ కోల్పోవడం కొంత ప్రభావం చూపిస్తున్నది. గత మ్యాచ్ల్లో అత్యంత వేగంగా బంతులు వేస్తున్నా వికెట్ తీయడంలో ఈ కశ్మీరి యువకుడు విఫలమవుతున్నాడు. బ్యాటింగ్పరంగా చూస్తే కెప్టెన్ కేన్ విలియమ్సన్.. అభిషేక్ శర్మ ఇద్దరూ బ్యాట్తో ఆరంభం అదరగొడితే రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, మర్క్రమ్ భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లగలిగితే విజయం దక్కినట్టే. ముంబై ఇండియన్స్పై గెలిచిన ఉత్సాహంతో ఉన్న కోల్కతా బృందం ఆఖరి రెండు మ్యాచ్లను సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నది. ఇదే జోరుతో హైదరాబాద్ను చిత్తు చేయాలనే కసితో బరిలోకి దిగనుంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగనుంది.