హుజూరాబాద్ : ఉత్తర ప్రదేశ్ లో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు రోడ్డు మీద ధర్నా చేస్తుంటే కేంద్ర మంత్రి కాన్వాయ్ వాహనాలు రైతుల మీద నుంచి పోనిచ్చి నలుగురు రైతుల ప్రాణాలు తీశారు. అలాంటి బీజేపీ ప్రభుత్వానికి ఓటెస్తారా? రైతుబంధు, రైతు బీమా పేరుతో రైతుల వెన్నంటి నిలుస్తున్న టీఆర్ఎస్కు ఓటెస్తారో తేల్చుకోవాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు.
జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మా కు మద్దతు ధర కావాలి. మార్కెట్లు రద్దు చేయవద్దని రైతులు ఏడాది నుంచి ధర్నా చేస్తే…నడి రోడ్డు మీద రైతులను చంపిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని హరీశ్రావు అన్నారు. తెరాస వచ్చాక రైతుల కోసం ఎన్ని పనులు చేసిందో ఆలోచించండి. తెలంగాణ రాక ముందు విద్యుత్ ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. 24 గంటల విద్యుత్ ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్. బీజేపీ ఎక్కడ ఉన్నా… రైతుల నుంచి విద్యుత్ బిల్లులు ముక్కు పిండి వసూలు చేస్తుంది అని మంత్రి అన్నారు.
పోయిన ఎండా కాలంలో నీళ్ల కోసం ఎదురు చూశారా…కాళేశ్వరం నీరు రాకముందు ఎస్సారెస్పీ కాలువల్లో నీళ్లు రావాలంటే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ధర్నాలు చేయాల్సిన పరిస్థితి. కాళేశ్వరం పూర్తయ్యాక కాలువల్లో నీరు వస్తోంది. నీటి తీరువాను రద్దు చేసిన సీఎం కేసీఆర్. పాత బకాయిలు రద్దు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అని మంత్రి అన్నారు. రైతులకు ఎకరానికి పది వేలు ఇచ్చింది కేసీఆర్ గాక ఎవరు? కరోనా కాలంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అధికారులకు జీతాలు బంద్ పెట్టి రైతులకు మాత్రం రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు
జీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచింది నిజం కాదా..ప్రభుత్వం రంగ సంస్థలను అమ్ముతున్నది నిజం కాదా… బీఎస్ ఎన్ఎల్ ఉద్యోగుల ఉద్యోగాలు ఊడగొట్టింది నిజం కాదా… తెలంగాణలో అంతటా డబుల్ బెడ్ రూం ఇండ్లు కడితే ఒక్క ఇల్లు కూడా కట్టనిది ఈటల రాజేందర్ కాదా? అని హరీశ్రావు ప్రశ్నించారు. దమ్ముంటే రా జమ్మికుంట గాంధీ బొమ్మ చౌరస్తా దగ్గరకు వస్తావా..మాట్లాడదాం అంటూ ఆయన సవాలు విసిరారు.
హరీశ్ రావు అబద్దాలు మాట్లాడుతున్నారని రాజేందర్ చెబుతున్నారు. 2016 పెన్షన్ నెల నెలా ఇస్తున్నాం. రైతు బంధు పథకం కింద ఏడాదికి పది వేలు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తున్నామని చెప్పా.. ఇందులో ఏది అబద్దమో చెప్పాలని ఆయన ఈటలకు చురకలంటించారు.నిజం మాట్లాడితే నన్ను తిడుతున్నావు.. ఎంత తిడతావో తిట్టు నేను పడతా..కానీ నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం కేసీఆర్ కాదా..నిన్ను ఈ స్థాయికి తెస్తే ఆయనకే ఘోరీ కడతా అంటావా? అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు.
ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతేనో.. ఆ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనో ఎన్నికలు వస్తాయి. కానీ రాజేందర్ తన స్వార్థం కోసం రాజీనామా చేసి ఎన్నికలు తెచ్చాడని హరీశ్రావు విమర్శించారు. కడుపు నింపి కష్టాలు తీర్చే తెరాసను గెలిపించాలని, ప్రలోభాలకు గురిచేసేవారిని తిప్పికొట్టి ధర్మాన్ని కాపాడాలని హరీశ్రావు కోరారు. పేద ప్రజల కోసం పనిచేసే గెల్లు శ్రీనివాస్ను గెలుపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.