జమ్మికుంట రూరల్ : రైతు నల్లచట్టాలు తెచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న పార్టీ బీజేపీ అని సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వర్దన్నపేట ఎమ్మెల్యే, మండల ఇంచార్జ్ ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సోమవారం ఇంటింట ప్రచారం నిర్వహించారు.
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని కోరారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు, సర్పంచ్ రాజ్కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు మమత, నాయకులు డప్పు చప్పుళ్ళతో ఘన స్వాగతం ఫలికారు. మహిళలు మంగళ హారతులు పట్టారు.
ప్రచారం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ…..ప్రైవేటీకరణ వైపు నడుస్తూ బీజేపీ అభివృద్ధిని మరించిందన్నారు. కార్లతో తొక్కించి రైతులను చంపుతున్న ప్రభుత్వం బీజేపీనేనని చెప్పారు. గ్యాస్ , పెట్రోల్, డిజీల్, నిత్యవసర సరుకుల ధరలు పెంచుతున్న బీజేపీకి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంట్, సాగు నీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. దేశంలో 75 ఏండ్ల తరువాత ప్రవేశపెట్టిన గొప్ప పథకం దళితబంధు పథకమని కొనియాడారు.
హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డె మమత, జడ్పీటీసి శ్రీరాం శ్యాం, ఉప సర్పంచ్ శ్రీనివాస్, రైతు బంధు జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు, నాయ కులు మనోహార్రావు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.