న్యూఢిల్లీ, జనవరి 2: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని(ఏబీపీఎస్) తప్పనిసరి చేయడంపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం తీవ్రంగా ఖండించారు. వర్కర్లు ఏబీపీఎస్ విధానానికి అనుసంధానం కాకపోతే వారికి కాకుండా రాష్ర్టాలకు జరిమానా విధిస్తామన్నారు.
పారదర్శకత కోసమే ఏబీపీఎస్ను తెచ్చామన్నారు. పని లభించకుండా ఎవరినీ అడ్డుకోమని.. కొన్ని గ్రామ పంచాయతీల్లో సాంకేతిక సమస్యలుంటే, అలాంటి వాటికి ఏబీపీఎస్ నుంచి మినహాయింపు ఇచ్చే విషయం ఆలోచిస్తామన్నారు. జిల్లా కలెక్టర్లకు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి హక్కు ఉంటుందన్నారు.