హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వానిది నియంతృత్వ వైఖరివల్ల రైతు ఆందోళనల్లో ఇప్పటిదాకా 770 మంది రైతులు మరణించారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. అమర రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఎవరిస్తారని, వారికి ఏ సమాధానం చెప్తారని కేంద్రాన్ని నిలదీశారు. ఏ ఎన్నికలోనూ బీజేపీకి ఓటు వెయ్యొద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఇందిరాపార్కు వద్ద భారతీయ కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా సంయుక్తంగా నిర్వహించిన రైతు మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియను పూర్తి చేసి, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు.
మరో ఏడాదైనా సరే రైతుల అన్ని డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు ఇండ్లకు వెళ్లేది లేదని, ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. కేంద్రం స్పందించకపోతే ఉద్యమాన్ని దేశవ్యాప్తం విస్తరిస్తామని హెచ్చరించారు. ఎంఎస్పీతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి అందరి భాగస్వామ్యంతో ఉన్నతస్థాయి కమిటీ వేయాలని అన్నారు. కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని, కేంద్రానికి అసలు వ్యవసాయ విధానమే లేదని, ఆ పార్టీ నేతలు ఎక్కడ కనిపించినా కనీస మద్దతు ధరపై నిలదీయాలని టికాయత్ పిలుపునిచ్చారు.
సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు ఢిల్లీ వెళ్లటం పాలకులకు సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. కార్పొరేట్లకు మేలుచేసేలా మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నదని, ఆరెస్సెస్ ఆదేశాలనే ఆ ప్రభుత్వం పాటిస్తుందని ఆక్షేపించారు. వ్యవసాయంతో సంబంధం ఉన్న వ్యవసాయం, రసాయనాలు ఎరువులు, మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ, రైల్వేలు, రోడ్లు, రవాణా, ఎగుమతులు, దిగుమతులు, విదేశీమంత్రిత్వశాఖ ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంతో సంబంధం ఉన్న 18 శాఖలతో ప్రత్యేకంగా అగ్రికల్చరల్ క్యాబినెట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
విలువైన దేశసంపదను అమ్మడమే బీజేపీ విధానంగా మారిందన్నారు. రైల్వేలు, బీఎస్ఎన్ఎల్, నౌకాయానాలు మొదలైన అన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న కేంద్రం ఇప్పుడు మార్కెట్ల(మండీ)ను అమ్ముకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. దేశ రైతాంగాన్ని శాశ్వతంగా వ్యవసాయానికి దూరం చేసి, రైతుల్ని కూలీలుగా మార్చాలని కుట్రలు చేస్తున్నదని చెప్పారు. బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని అన్నారు. ధర్నాలో ఎస్కేఎం నేతలు ఆశిష్ మిట్టల్, అతుల్ కుమార అంజన్, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల, సాగర్, విస్సా కిరణ్ ఇతర నాయకులతో పాటు పలు రైతుల సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు అనుకూల విధానాలు అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని రాకేష్ టికాయత్ తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సహాయం అందించాలని వెల్లడించారు. ఇక్కడి రైతుల పంటలకు ఇబ్బంది కలగకుండా సాగునీరు అందించటం గొప్ప విషయమని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రయోజనాల రీత్యా అమలుచేస్తున్న అన్ని విధానాలను మిగితా రాష్ర్టాల్లో తేవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతామని పేర్కొన్నారు.