భార్యాభర్తల బంధంలో ప్రేమ, విడాకులని మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ విడాకులు తీసుకోకుండానే భర్తను వదిలేసి ప్రియుడి వద్దకు వెళ్లింది ఓ మహిళ. అందుకు వారిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. భార్య చెల్లెలితో ఆ భర్త పెళ్లి చేసుకున్నాక ఆమెను ప్రియుడి వద్దకు పంపేందుకు అంగీకరించాడు. కానీ విషయం ఇంతటితో సమసిపోలేదు.
వివరాలలోకి వెళ్తే.. బీహార్ రాజధాని పట్నాకి చెందిన కామిని(పేరు మార్చబడినది) తన తోటి ఉద్యోగి రాహుల్ని ప్రేమించింది. కానీ తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేశారు. కొద్దికాలం తరువాత కామిని భర్తతో తన ప్రేమ వ్యవహారం చెప్పింది. తాను మళ్లీ రాహుల్ వద్దుకు వెళ్లిపోతానని.. అందుకు సహకరించాలని కోరింది. దానికి ప్రతిఫలంగా కామిని తన చెల్లెలు సుప్రియ(పేరు మార్చబడినది)తో వివాహం చేయిస్తానని చెప్పింది.
కామిని భర్త అందుకు ఒప్పుకోవడంతో.. ఆమె తన చెల్లెలు సుప్రియకు తన భర్తతో కోర్టులో వివాహం జరిపించింది. అనంతరం కామిని తన ప్రియుడు రాహుల్ వద్దకు వెళ్లిపోయింది. కొద్దికాలం కామినితో సహజీవనం చేశాక.. రాహుల్ ఆమెను వదిలివెళ్లిపోయాడు. దీంతో కామిని ఏకాకిగా మారింది. దిక్కుతోచని స్థితిలో తన చెల్లెలు సుప్రియ వద్దకు ఆమె వెళ్లింది.
కామిని తన పరిస్థితి వివరించి.. ఇకపై తాను కూడా చెల్లెలితో కలిసి భర్త వద్దనే ఉంటానని చెప్పింది. కానీ అందుకు సుప్రియ అంగీకరించకపోవడంతో ఇద్దరు గొడవపడ్డారు. కామిని తన భర్తతో ఇంకా విడాకులు తీసుకోకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం భర్తకోసం గొడవ పడే అక్కాచెల్లెళ్లకు మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్స్లింగ్ నిర్వహిస్తున్నారు.