హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూన్ నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దక్షిణ ద్వీప కల్ప ప్రాంతంపై సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, జూన్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు చిక్మగళూర్, బెంగుళూర్ మీదుగా వెళ్తున్నాయని, రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 2వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో బుధవారం వరకు పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. కాగా, మంగళవారం 16 జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా జనగాం జిల్లా కోయిల్ కొండ 4.50, సూర్యాపేట జిల్లా నూతనకల్ 4.30, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ 4.03, నాగర్కర్నూల్ జిల్లా సిరసనగండ్ల 3.95 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఒక వైపు వర్షాలు కురుస్తూనే..మరో వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆరు జిల్లాల్లో 39 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా నాగుల వంచ 40.31, ముదిగొండ 40.29, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం 40.28, వరంగల్ జిల్లా కల్లెడ, భద్రాద్రి జిల్లా అల్లపల్లి 42.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.