అయోధ్య భూ కుంభకోణం బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఆరోపించింది. బీజేపీ హిందూత్వ సిద్ధాం తం పక్కా వాణిజ్యపరమైందని ఎద్దేవా చేసింది. ‘బీజేపీ హిందూత్వ చోర్ బజార్ (దొంగల మార్కెట్) లాంటిది. ఈ విషయం ఇప్పుడు స్పష్టమవుతున్నది. అయోధ్యలో భూ మాఫియా ఈ చోర్ బజార్లో భాగమే. ప్రధాని నరేంద్రమోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. అదే సమయంలో బీజేపీ వ్యాపారులు ఆలయం చుట్టుపక్కల అత్యంత విలువైన భూములను కొనటంలో బిజీగా ఉన్నారు.
ఆలయ నిర్మాణ ట్రస్టు 70 ఎకరాల భూమిని సేకరిస్తే, అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, బీజేపీకి సన్నిహితంగా ఉండే పోలీస్, రెవెన్యూ అధికారులు కోట్ల విలువైన భూములు దక్కించుకొన్నారు. ఎమ్మెల్యేలు, నగర మేయర్, రాష్ట్ర ఓబీసీ కమిషన్ సభ్యుడు, డివిజనల్ కమిషనర్, అధికారుల బంధుగణం ఆలయ సమీపంలోని భూములను ఎలా దక్కించుకున్నారన్న విషయాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ స్పష్టంగా బయటపెట్టింది. ఆలయ నిర్మాణం పూర్తయితే ఆ పరిసరాల స్వరూపమే మారిపోతుంది. భూముల ధరలకు రెక్కలొస్తాయి.
అందుకే మతం పేరుతో పక్కా వ్యాపారం చేశారు. ఆలయం కోసం రక్తం చిందించిందెవరు? ఇప్పుడు లాభపడుతున్నదెవరు? ఇది పక్కా కుంభకోణం. అయోధ్య మేయర్ కొన్ని లక్షల రూపాయలకు భూమి కొని ఐదు నిమిషాల్లోనే రామజన్మభూమి ట్రస్టుకు దాన్ని రూ.16 కోట్లకు అమ్మేశారు. ఆ మేయర్ బీజేపీ వ్యక్తి. రాముడి పేరుతో నడిచిన పక్కా చోర్ బజార్ ఇది. హిందూత్వ అంటే ఇదేనని ఎవరైనా అంటే వాళ్లుముందు ముకుళిత హస్తాలతో సాష్టాంగపడాల్సిందే’ అని శివసేన అధికార పత్రిక సామ్నా తన ఎడిటోరియల్లో విమర్శించింది.
హిందువులకు అవమానం
హిందూత్వ పేరుతో బీజేపీ చేస్తున్న వ్యాపారం వల్ల హిందువులందరికీ అవమానం జరుగుతున్నదని సామ్నా మండిపడింది. అయోధ్య ఆలయంకోసం జీవితమంతా కొట్లాడిన ఎల్కే అద్వానీని పక్కుకు తప్పించి, అయోధ్యను ఇప్పుడు బిజినెస్ సెంటర్గా మార్చారని విమర్శించింది. ‘హిందూత్వ నినాదం నుంచి శివసేన పక్కకు జరిగిందని బీజేపీ ఉపన్యాసాలు దంచుతుంది. ఆ పార్టీ మాత్రం వ్యాపార హిందూత్వను కొనసాగిస్తున్నది. వారు తమ వ్యాపార ప్రయోజనాల కోసం సాక్షాత్తూ రాముడిని కూడా వదిలిపెట్టరు’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.