నాగపూర్: ఇటీవల వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. జ్ఞానవాపి అంశం ఎప్పటి నుంచో ఉందని, చరిత్రను మనం మార్చలేమని, నేటి తరానికి చెందిన హిందువులు కానీ ముస్లింలు కానీ ఆ వివాదాన్ని సృష్టించలేదని, ఆ ఘటన ఆ రోజుల్లో జరిగిందని, ఇస్లాం మతం బయట నుంచి వచ్చిందని, ఆ సమయంలో జరిగిన దాడుల్లో దేవస్థానాలను నాశనం చేశారని, భారతీయ స్వాతంత్య్ర కాంక్షమనోబలాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో అలా చేశారని మోహన్ భగవత్ అన్నారు.
హిందువులు ప్రత్యేకంగా పూజించే అనేక ప్రదేశాల్లో వివాదాలను సృష్టించారని, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ఆలోచించరని, నేటి ముస్లింలకు పూర్వీకులు హిందువులే అని, మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకు వాళ్లను ఆరోజుల్లో దూరంగా ఉంచారని, అందుకే హిందువులు తమ మతపరమైన ప్రదేశాల రక్షణ కోరుతున్నట్లు భగవత్ వెల్లడించారు. మన మెదడులో సమస్యలు ఉంటే, ఆ సమస్యలు పెరుగుతూనే ఉంటాయని, కానీ పరస్పర ఒప్పందం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని, మార్గం దొరకని పక్షంలో ప్రజలు కోర్టును ఆశ్రయిస్తారని, ఒకవేళ కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చినా దాన్ని స్వాగతించాలని భగవత్ తెలిపారు. కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, మన న్యాయవ్యవస్థ అత్యున్నతమైందని, ఆ కోర్టు నిర్ణయాలను ప్రశ్నించరాదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు.
ఎటువంటి రకమైన ఆరాధన పట్ల తమకు భేదభావం లేదన్నారు. అన్ని రకాల మతారాధనలు పవిత్రమైనవన్నారు. కొందరు కొన్ని రకాల ఆరాధనలను దత్తత తీసుకున్నారని, కానీ అవన్నీ మన రుషులు, మునులు, క్షత్రియుల నుంచి వచ్చినవే అన్నారు. మన పూర్వీకులంతా ఒక్కటే అన్నారు. కొన్ని ప్రదేశాల పట్ల ప్రత్యేక భక్తి ఉందని, వాటి గురించి మాట్లాడామని, కానీ ప్రతి రోజు కొత్త విషయాన్ని బయటకు తీసుకురావద్దన్నారు. జ్ఞానవాపి వివాదాన్ని ఎందుకు మరింత విస్తృతం చేయాలని ప్రశ్నించారు. జ్ఞానవాపి పట్ల భక్తిభావం ఉందని, కానీ ప్రతి మసీదులోనూ శివలింగం కోసం వెతకడం సరికాదు అని భగవత్ తెలిపారు.