పూజలో శంఖం ఎందుకు పూరిస్తారు? – భరత్ కుమార్, గజ్వేల్
మన సనాతన యోగ సంప్రదాయ రీతులలో శబ్దబ్రహ్మ సాధన ఒకటి. పరబ్రహ్మ స్వరూపాన్ని శబ్దసాధన ద్వారా కూడా తెలుసుకోవచ్చు. పరమేశ్వరుడు తొమ్మిది రకాలైన శబ్దాలను, వాటి ప్రాధాన్యం గురించి పార్వతీ దేవికి వివరించాడని శివపురాణం ఉమాసంహిత పేర్కొన్నది. అందులో ఎనిమిదో శబ్దం శంఖారావం. శంఖ నాదాన్ని చేసే సాధకుడు తనకు నచ్చిన రూపాన్ని పొందుతాడని పురాణ వచనం.
శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, కీర్తిప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీకగా చెబుతారు. శంఖం పూరించడం వల్ల మన చుట్టూ ఉన్న రుణాత్మక వైఖరులు దూరమై, సానుకూల వాతావరణం నెలకొంటుంది. శంఖ నాదం వినిపించినంత దూరం దుష్టశక్తులు నాశనమవుతాయని, వ్యాధికారక క్రిములు నశిస్తాయని నమ్మకం. అంతేకాదు, నిత్యం శంఖం పూరించడం వల్ల ముఖానికి వ్యాయామం అవుతుంది. శ్వాసక్రియ, శ్రవణ తంత్రులు, ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుందని పెద్దలు చెబుతారు. అందుకే పూజా సమయంలో శంఖాన్ని పూరించడం ఆనవాయితీగా ఏర్పడింది.
-డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370