కర్హల్ (యూపీ), ఫిబ్రవరి 11: యూపీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. మరో ఆరుదశల్లో పోలింగ్ జరుగనున్న ఈ రాష్ట్రంలో.. కర్హల్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి పడింది. దీనికి కారణం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో నిలవడమే. ఈ ప్రాంతంలో అఖిలేశ్ గెలువడం నల్లేరు మీద నడకేనని వాదనలు వినిపిస్తున్నాయి. అఖిలేశ్ గెలిచి ఆయన పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ప్రాతినిథ్యం వహించే కర్హల్ అభివృద్ధి పరుగులు పెడుతుందని ఓటర్లు భావిస్తున్నారు. గడిచిన రెండు దశాబ్దాలుగా ఎస్పీకి ఈ ప్రాంతం కంచుకోటగా ఉన్నది. అఖిలేశ్ను ఇక్కడి ప్రజలు ‘ఘర్ కా లడకా (మన ఇంటి పిల్లాడు)’గా అక్కున చేర్చుకొంటున్నారు. ఇక్కడి 3.7 లక్షల ఓటర్లలో 1.4 లక్షల మంది యాదవ్, 34 వేల మంది ఓబీసీ (శఖ్యాలు), 14 వేల మంది ముస్లిం కమ్యూనిటీకి చెందినవారు. వీరి ఓట్లన్నీ ఎస్పీకే పడుతాయని నివేదికలు చెబుతున్నాయి. కర్హల్ నుంచి కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ను బీజేపీ రంగంలోకి దింపింది. మోదీ, యోగి చరిష్మాతో తనను గెలుపు వరిస్తుందని ఆయన భావిస్తున్నారు. బీఎస్పీ తరఫున కుల్దీప్ నారాయణ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు అభ్యర్థులను నిలుపలేదు. దీంతో ఓట్ల చీలిక ఉండదని, ఇది ఎస్పీకి కలిసొస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2009 లోక్సభ ఎన్నికల్లో ఫిరోజాబాద్ నుంచి అఖిలేశ్, బఘేల్ బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో అఖిలేశ్ గెలుపొందారు. కర్హల్కు మూడో దశలో ఫిబ్రవరి 20న పోలింగ్ జరుగనున్నది.
బీజేపీని కాపాడేందుకు ఓ పార్టీ యత్నం: అఖిలేశ్
బుదౌన్: మాయావతి నేతృత్వంలోని బీఎస్పీని ఉద్దేశించి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పరోక్ష ఆరోపణలు చేశారు. అంబేద్కర్ ఆదర్శాల నుంచి పక్కకెళ్లిన ‘ఓ పార్టీ’ బీజేపీని ఎస్పీ ఓడించకుండా అడ్డుకునే లక్ష్యంతో పోటీచేస్తున్నదన్నారు. బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకో వడంలో సాయం చేసేందు కు పోటీచేస్తున్నదని వ్యాఖ్యానించారు. బదౌన్ లో శనివారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.