Diego Garcia : అమెరికా (USA) లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హిందూ మహాసముద్రం (Indian Ocean) లోని అమెరికా-బ్రిటన్ (US-Britain) సంయుక్త సైనిక స్థావరం డీగో గార్సియా (Diego Garcia) పై క్షిపణి దాడి (Missile Attack) కి ప్రయత్నించామన్న ఆరోపణలను ఇరాన్ (Iran) తీవ్రంగా ఖండించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ దేశానికి చెందిన ఓ సీనియర్ అధికారి అల్ జజీరాకు స్పష్టంచేశారు. తమ క్షిపణుల పరిధి 2 వేల కిలోమీటర్లు మాత్రమేనని చెప్పారు.
ఇరాన్ సుమారు 4 వేల కిలోమీటర్ల దూరంలోని డీగో గార్సియా లక్ష్యంగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలుపుతున్నాయి. వాటిలో ఒకటి సాంకేతిక లోపంతో గాల్లోనే విఫలమవ్వగా.. మరొకదాన్ని అమెరికా యుద్ధనౌక అడ్డుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ వార్తలు నిజమైతే ఇరాన్ క్షిపణి సామర్థ్యం అంచనాలను మించి పెరిగినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్లోకి భూతల దళాలను పంపేందుకు పెంటగాన్ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. తాను ఎక్కడికీ దళాలను పంపడం లేదని, ఒకవేళ పంపినా మీకు చెప్పనని తనదైన శైలిలో మాట్లాడారు. ఈ క్రమంలో అమెరికా మధ్యప్రాచ్యానికి భారీగా సైనిక బలగాలను తరలిస్తోంది. కాలిఫోర్నియా నుంచి సుమారు 2,200 మంది మెరైన్లతో కూడిన మూడు యుద్ధనౌకలు ఇప్పటికే బయలుదేరాయి.