హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక ఓడీఎఫ్+ గ్రామాలున్న రాష్ట్రంగా తెలంగాణ టాప్లో నిలవటంపై మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో అత్యధిక ఓడీఎఫ్+ గ్రామాలున్నాయి? అని ప్రశ్నిస్తూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ 96.74 శాతంతో టాప్లో నిలిచింది. రెండో స్థానంలోని తమిళనాడు 35.39 శాతంతో మనకు మైళ్ల దూరంలో ఉన్నది. గ్రామీణాభివృద్ధిలో పల్లెప్రగతి కొత్త శకానికి నాంది పలికింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రికి, సిబ్బందికి నా అభినందనలు’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు.. ‘అభినందనలకు ధన్యవాదాలు. ఇది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థ నాయకత్వం, పీఆర్ అండ్ ఆర్డీ అధికారులు, సిబ్బంది గొప్ప పనితనంతోనే సాధ్యమైంది’ అని రీట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సహకారంతో దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ బంజారాహిల్స్లోని ముఫకంజా కాలేజీలో తెలంగాణ అసిస్టివ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ను నిర్వహించనున్నది. దీన్ని మంగళవారం మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ ప్రారంభించనున్నారు.