అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థబ్ధుగా ఉన్న నాయకులు మంచి ముహూర్తం చూసుకుని అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్టీలు వీడిన నాయకులు ఏ పార్టీలో చేరితే భవిష్యత్ బంగారు బాట పడుతుందని అడిగి జోస్యం చెప్పించుకుంటున్నారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు కృష్ణ దేవరాయలు (MP Krishna Devarayalu) 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ(TDP) ప్రత్యర్థి రావుపాటి సాంబశివరావుపై గెలుపొందారు. 2024 అసెంబ్లీతో పాటు పార్లమెంట్(Parliament) కు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్(YS Jagan) అభ్యర్థుల మార్పుపై మూడు నెలలుగా కసరత్తులు చేస్తున్నారు. దీంట్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్పై స్పష్టత రాకపోవడంతో వైసీపీ (YCP) కి రాజీనామా చేశారు.
ఇటీవల నరసరావుపేట ఎంపీ స్థానానికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్(Anil kumar Yadav) ను ఇన్చార్జ్గా నియమించారు. దాదాపు రాబోయే ఎన్నికల్లో అనిల్ కుమార్ పేరు ఖరారు కావడంతో ఇక ఏదో ఒక పార్టీలో చేరాలని, మంచి ముహూర్తం చూసుకుని ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని వెల్లడిస్తానని కృష్ణ దేవారాయ వెల్లడించారు.
వైసీపీలోకి వెనక్కు వచ్చే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. తాను విశ్వాస ఘాతానికి పాల్పడ్డానని కామెంట్లు చేసే వాళ్ళు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారో లేక వేరే వాళ్ళ స్క్రిప్ట్ లు చదువుతున్నారో తేల్చుకోవాలని అన్నారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి మళ్లీ తానే పోటీ చేస్తానని వెల్లడించారు.