కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నాటి నుంచి ఆ దేశంలో షియా ముస్లింలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట దాడులు చోటు చేసుకుంటున్నాయి. కాందహార్, కుందుజ్ ప్రావిన్స్లోని రెండు షియా మసీదులపై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా మరణించారు. వందలాది సంఖ్యలో జనం గాయపడ్డారు. ఈ క్రమంలో షియా ముస్లింలకు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్-కే) ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ‘షియా ముస్లింలు అత్యంత ప్రమాదకారులని, వారు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని, బాగ్దాద్ నుంచి ఖొరసాన్ వరకు ప్రతి చోట షియా ముస్లింలపై గురి పెడతాం’ అని హెచ్చరించింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ నడుపుతున్న వార పత్రిక అల్-నబ ఈ హెచ్చరికను ప్రచురించింది. ఇండ్లు, ఇతర చోట్లా షియా ముస్లింలే లక్ష్యంగా దాడులు చేయనున్నట్లు ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది.
ఆఫ్ఘన్లో తాలిబన్ల పాలన మొదలైన నాటి నుంచి అశాంతి నెలకొన్నది. ఉగ్రవాదు దాడులు తాలిబన్ ప్రభుత్వంలో దాడులు పెరగ్గా.. షియా ముస్లింలకు ముప్పు పెరిగింది. అక్టోబర్ 8న కుందుజ్ ప్రావిన్స్లోని షియా మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలడంతో వంద మందికిపైగా మరణించారు. ఈ ఘటన అనంతరం శుక్రవారం కాందహార్లోని షియా మసీదుపై బాంబు దాడి జరిగింది. ఇందులో 60 మందికిపైగా మృత్యువాతపడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు ఆక్రమించిన అనంతరం.. దేశాన్ని ఉగ్రవాదానికి నిలయంగా మార్చడానికి అనుమతించబోమని ప్రపంచ దేశాలకు తాలిబన్ నేతలు హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో శాంతిని పునరుద్ధరించడానికి తాము కృషి చేస్తామని ప్రకటించారు. అయితే, షియా ముస్లింలే లక్ష్యంగా దాడులను అరికట్టడంలో తాలిబన్లు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు యాక్టివ్గా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ హింసాకాండను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదానికి సహకరించేవారందరినీ జవాబుదారులను చేయాలని సూచించింది.