లండన్: దాదాపు మూడు వారాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచం ఆహార సంక్షోభం వైపుగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజవాయువు ధరలు పెరిగిన కారణంగా ఫెర్టిలైజర్ కంపెనీలు ఉత్పత్తిని సగానికి తగ్గించేశాయి. ఇది ప్రత్యక్షంగా పంట ఉత్పత్తిపై ప్రభావం చూపించనున్నది. ఇదే సమయంలో ప్రపంచ గోధుమ వాణిజ్యంలో 30 శాతం వాటా ఉన్న రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. ఇతర ఉత్పత్తుల పరిస్థితి కూడా ఇదే. అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం చేసేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు. ఆహార కొరత భయాందోళనతో పలు దేశాలు ముందస్తు జాగ్రత్తతో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేశాయి. దీంతో ఇతర దేశాల్లో ఆయా ఉత్పత్తుల కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నదని అంచనా వేస్తున్నారు.
సంక్షోభం ఎంత తీవ్రంగా ఉంటుందో?
పంట ఉత్పత్తిని పెంచుకునేందుకు ఎరువులు కీలకం. యూరియా వంటి నత్రజని ఆధారిత ఎరువుల తయారీలో సహజవాయువు ప్రధానం. అయితే సహజవాయువు ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఫెర్టిలైజర్ కంపెనీ యారా ఇంటర్నేషనల్ ఐరోపాలో అమ్మోనియా, యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని 45 శాతం తగ్గించేసింది. వ్యవసాయంలో కీలకమైన ఈ రెండు ఫెర్టిలైజర్ల తగ్గింపు వలన ప్రపంచ ఆహార సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని కంపెనీ యజమాని స్వెయిన్ టోర్ పేర్కొన్నారు. ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటామా? లేదా? అనేది కాదు.. అది ఎంత తీవ్రంగా ఉంటుందో చూడాల్సి ఉందని అన్నారు. దేశీయంగా ఉత్పత్తి లేని దేశాలపై యూరియా కొరత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
రిస్క్లో గోధుమ సరఫరా
ప్రపంచ గోధుమ వాణిజ్యంలో 30 శాతం వాటా ఉన్న రష్యా, ఉక్రెయిన్ల నుంచి సరఫరా ఇప్పుడు రిస్క్లో ఉన్నది. గత వారం ప్రారంభంలో గ్లోబల్ గోధుమ ధరలు ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రష్యా నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. ఉక్రెయిన్లో గోధుమ నాటే సీజన్ ప్రారంభంలోనే యుద్ధం వచ్చింది. మొక్కజొన్న, సోయాబీన్, వెజిటబుల్ ఆయిల్ ధరలు కూడా పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.